10-09-2024 03:29:28 AM
నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్కు ఏమాత్రం తీసిపోని విధంగా జరిగే పారాలింపిక్స్ క్రీడలు పారిస్ వేదికగా ఆదివారం ఘనంగా ముగిశాయి. వైకల్యం శరీరానికే కానీ ప్రతిభకు అడ్డు రాదని చూపుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారా అథ్లెట్లు పతకాల పంట పండించి గత పన్నెండు రోజులుగా అభిమానులను అలరించింది. పతకాల వేటలో ముందుండే డ్రాగన్ దేశం మరోసారి జోరు ప్రదర్శించింది. ఏకంగా 94 స్వర్ణాలు కొల్లగొట్టిన చైనా మొత్తం 220 పతకాలు సొంతం చేసుకొని తొలి స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత్ 29 పతకాలతో సత్తా చాటి విశ్వవేదికపై జాతీయ జెండాను రెపరెపలాడించింది. ఒలింపిక్స్తో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ పతకాలు దేశానికి పట్టుకొచ్చిన మన పారా అథ్లెట్ల ప్రదర్శనకు సలాం చెబుతూ సగర్వంగా స్వదేశానికి స్వాగతం పలుకుదాం..
విజయక్రాంతి ఖేల్ విభాగం: పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్ ముగింపు వేడుకలు ఆదివారం అర్థరాత్రి ఘనంగా జరిగాయి. ఫ్రాన్స్లోని ప్రఖ్యాత స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియం వేదికగా ముగింపు వేడుకలు అదు ర్స్ అనిపించాయి. 12 రోజుల పాటు అభిమానులను అలరించిన పారాలింపిక్స్ క్రీడ ల్లో ముగింపు వేడుకల్లో శరణార్థుల టీమ్తో పాటు 164 దేశాలు తమ జాతీయ జెండా తో పరేడ్ నిర్వహించాయి. భారత్ తరఫున హర్వీందర్ సింగ్, ప్రీతి పాల్ పతాకధారులుగా వ్యవహరించారు. అనంతరం అంత ర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ వేడుకలకు హాజరైన వేలా ది మంది అభామానులనుద్దేశించి ప్రసంగించారు.
ఆండ్రూ ప్రసంగం తర్వాత పారా లింపిక్ జెండాను అవగతనం చేసి పారిస్లో క్రీడలు ముగిసినట్లుగా ప్రకటించారు. 2028 లో క్రీడలను నిర్వహించనున్న లాస్ ఏం జిల్స్ నిర్వాహకులకు బ్యాటన్ అందజేసిన పారాలింపిక్ కమిటీ అమెరికా జాతీయ జెండాను ఎగురవేసి ఆ దేశ జాతీయ గీతాన్ని వినిపించారు. అనంతరం ఒలింపిక్ టార్చ్ను ఆర్పివేయడంతో పారాలింపిక్స్ వేడుకలు అధికారికంగా ముగిశాయి. ఇక పతకాల వేటలో డ్రాగన్ దేశం చైనా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 220 పతకాలతో (94 స్వర్ణాలు, 76 రజతాలు, 50 కాంస్యాలు) చైనా తొలి స్థానంలో నిలవగా.. 24 పతకాలతో బ్రిటన్ (49 స్వర్ణాలు, 44 రజతాలు, 31 కాంస్యాలు) రెండో స్థానంలో.. 105 పతకాలతో అమెరికా (36 స్వర్ణాలు, 42 రజతాలు, 27 కాంస్యాలు) మూడోస్థానంలో నిలిచాయి.
ఒలింపిక్స్లో అలా.. పారాలో ఇలా
రెండు నెలల క్రితం ఇదే పారిస్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ నుంచి 119 మంది అథ్లెట్ల బృందం వెళ్లి కేవలం ఆరు పతకాలతో స్వదేశానికి తిరిగొచ్చింది. కట్ చేస్తే అదే పారిస్కు 84 మందితో వెళ్లిన పారా అథ్లెట్ల బృందం అత్యుత్తమ ప్రదర్శనతో ఏకంగా 29 పతకాలు కొల్లగొట్టి సగర్వంగా స్వదేశంలో అడుగుపెట్టనుంది. మరి ఒలింపిక్స్తో పోలిస్తే పారాలింపిక్స్లో మన అథ్లెట్ల ప్రదర్శన ఎందుకు మెరుగ్గా ఉందన్న ప్రశ్నలు మదిలో మెలగడం ఖాయం. నిజానికి ఒలింపిక్స్లో అంగవైకల్యం లేని ఆటగాళ్లు పాల్గొంటే.. పారాలింపిక్స్లో మాత్రం అంగవైక్యలం ఉన్న ఆటగాళ్లు పోటీ పడతారు. టోక్యో పారాలింపిక్స్లో మన అథ్లెట్లు 19 పతకాలతో సత్తా చాటడంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు పారాలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) ప్రత్యేక శ్రద్ధ వహించింది.
పారిస్ పారాలింపిక్స్ కోసం టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్స్) కింద రూ. 74 కోట్లు కేటాయించారు. టోక్యోతో పోలిస్తే ఇది రెండింతలు కావడం విశేషం. 12 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నప్పటికీ ముఖ్యంగా ఏడు విభాగాల్లో (అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, పవర్లిఫ్టింగ్, షూటింగ్, ఆర్చరీ, ఫుట్బాల్) ఈ నాలుగేళ్లలో అత్యధిక క్రీడా పోటీలు నిర్వహించి అథ్లెట్లను పారాలింపిక్స్కు సన్నద్ధం చేశారు. ఇందులో 1500 మంది అథ్లెట్లతో పాటు 200 టెక్నికల్ స్టాఫ్, 150 మంది వలంటీర్లు, 350 సహాయక సిబ్బంది, 300 ఎస్కార్ట్, 20 క్లాసిఫయర్స్ టోర్నీల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా పారా క్రీడల్లో ఒకే ఈవెంట్లో వివిధ కేటగిరీల కింద అథ్లెట్లు పోటీ పడడం భారత్కు సానుకూలాంశంగా మారింది. బ్యాడ్మింటన్తో పాటు అథ్లెటిక్స్ విభాగంలో ఇది మనకు బాగా అచ్చొచ్చింది. కానీ ఒలింపిక్స్లో మాత్రం ఈ అవకాశం ఉండదు.
మన అథ్లెట్లతో పోలిస్తే పారా అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేయడానికి ఇదే ప్రధాన కారణం. జావెలిన్ త్రో విభాగంలోనే ఎఫ్ 64, ఎఫ్ 46, ఎఫ్ 41 కేటగిరీలు ఉండగా.. బ్యాడ్మింటన్లో ఎస్ఎల్ 4,ఎస్ఎల్ 3, యూవీ 2 లాంటి కేటగిరీల్లో మన అథ్లెట్లు పోటీ పడి పతకాలు సాధించారు. ముఖ్యంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ (అథ్లెటిక్స్) విభాగంలో గత రెండు పారాలింపిక్స్లో మంచి ప్రదర్శన నమోదు చేశారు. టోక్యోలో అథ్లెటిక్స్ విభాగంలో 8 పతకాలు రాగా.. ఈసారి పారిస్లో ఆ సంఖ్య 17కు చేరడం విశేషం. అందులో నాలుగు స్వర్ణాలు ఉండడం గొప్ప విషయం. త్రోయింగ్, ట్రాక్ ఈవెంట్స్, హై జంప్ విభాగాల్లో భారత్కు పతకాలు వచ్చి చేరాయి. మహిళల అథ్లెటిక్స్ విభాగంలో తెలంగాణ అథ్లెట్ దీప్తి జివాంజీ, ప్రీతి పాల్, సిమ్రన్ సింగ్ తొలిసారి పతకాలతో మెరిసి సత్తా చాటారు.
అద్వితీయ భారతం..
పారాలింపిక్స్కు భారత్కు అదిరే ముగింపు లభించింది. 25 పతకాలే లక్ష్యంగా 84 మందితో కూడిన భారత పారా అథ్లెట్ల బృందం అంచనాలకు మించి ప్రదర్శనతో 25ను కాస్తా 29గా మార్చింది. క్రీడలు ప్రారంభమైన రెండో రోజు నుంచే పతకాల వేటలో దూసుకెళ్లిన మన అథ్లెట్లు ఆఖర్లో కూడా అదరగొట్టారు. జావెలిన్ త్రోలో నవ్దీప్ సింగ్ పసిడితో.. 200 మీటర్ల పరుగులో సిమ్రన్ కాంస్యంతో మెరిశారు. మొత్తంగా భారత బృందం ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో పారాలింపిక్స్ చరిత్రలోనే అత్యత్తుమ ప్రదర్శనతో సత్తా చాటారు. ఒక్క ట్రాక్ అండ్ ఫీల్డ్ (అథ్లెటిక్స్) విభాగంలోనే భారత్కు 4 స్వర్ణాలు సహా 17 పతకాలు దక్కడం గమనార్హం. పారాలింపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటిదాకా 60 పతకాలు గెలిస్తే అందులో పారిస్లోనే దాదాపు సగం దాకా వచ్చాయి. గత రెండు పారాలింపిక్స్ కలిపి (29+19) భారత్ 48 పతకాలు నెగ్గడం విశేషం. 1968 నుంచి 2016 వరకు భారత్కు కేవలం 12 పతకాలు మాత్రమే వచ్చాయి.