10 July, 2026 | 1:52 AM

చిట్యాల రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్

10-07-2026 12:50 AM

శంకుస్థాపన స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

చిట్యాల, జూలై 9: ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న చిట్యాలభువనగిరి రహదారి విస్తరణ పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని గురువారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. వేముల వీరేశం చొరవతో ఈ పనులు ప్రారంభం కానుండగా, త్వరలో జరగనున్న శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో సంబంధిత అధికారులతో కలిసి రోడ్డు నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు.

పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేసేలా అవసరమైన సూచనలు చేశారు. చిట్యాల నుంచి భువనగిరి వరకు నిత్యం భారీగా వాహనాల రాకపోకలు సాగుతున్నప్పటికీ, ఇరుకైన సింగిల్ రోడ్డు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్డు విస్తరణతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.