12 April, 2026 | 5:15 PM

సీబీజీ ప్లాంట్‌కు భూమిపూజ కార్యక్రమం

12-04-2026 03:36 PM

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో సంపీడన బయో-గ్యాస్(Compressed Biogas) ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఆదివారం భూమిపూజ కార్యక్రమం జరిగింది. జూనో జౌల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ(Juno Joule Biofuels Private Limited) రూ. 700 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఈ కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీని ద్వారా సుమారు 1,400 మందికి ఉపాధి లభిస్తుందని, ఇందులో 30 శాతం మంది ఉద్యోగులు మహిళలే కావడం, సమ్మిళిత వృద్ధి పట్ల ఉన్న నిబద్ధత తెలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం మూడు దశల్లో క్లస్టర్-ఆధారిత నమూనాలో అమలు చేయబడుతుందని, ఇందులో రోజుకు 100 టన్నుల సామర్థ్యం కలిగిన 10 సీబీజీ ప్లాంట్ల అభివృద్ధి చేపట్టబడుతుందని తెలిపారు. మొదటి, రెండవ దశలలో ఒక్కోదానిలో మూడు ప్లాంట్లు చొప్పున, మూడవ దశలో నాలుగు ప్లాంట్లు ఏర్పాటు చేయబడతాయని, వరి గడ్డి, పశువుల పేడ, కోళ్ల వ్యర్థాల వంటి సుస్థిర ముడిపదార్థాలను వినియోగించి, ఈ ప్లాంట్లు బయో ఇంధన వాయువును ఉత్పత్తి చేస్తారని ఆయన వెల్లడించారు. తద్వారా ఇవి వలయ ఆర్థిక విధానాలకు (Circular Economy), స్వచ్ఛ ఇంధన పరివర్తనకు దోహదపడతాయని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.