మాతృభాషల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే వెడమ బొజ్జు
గోండి, కొలాం భాషలను ఏఐ సాంకేతికతతో ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఐటీడీఏ ప్రత్యేక కార్యక్రమం
విశ్వ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఐటీడీఏ ఉట్నూర్
ఉట్నూర్,(విజయక్రాంతి): విశ్వ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్లోని సమావేశ మందిరంలో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో ఘనంగా గుండి భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంప్రదాయ ఆదివాసీ దోతీలు ధరించి విచ్చేసిన ఆదివాసీ పెద్దలు, గ్రామ పటేళ్లు, సంఘ నాయకులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గిరిజన మహిళలు, విద్యార్థినులు సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో ఆదివాసీ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబిస్తూ అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడమ బొజ్జు మాట్లాడుతూ, గోండి, కొలాం వంటి ఆదివాసీ మాతృభాషలు కేవలం సంభాషణకు మాత్రమే పరిమితం కాకుండా గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానానికి ప్రతీకలని పేర్కొన్నారు. గిరిజన సమాజం తమ సంస్కృతి, ఆచార వ్యవహారాలను ఇప్పటివరకు పరిరక్షిస్తూ వస్తున్నందువల్లే ఈ భాషలు జీవించి ఉన్నాయని కొనియాడారు.
ప్రస్తుతం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆధ్వర్యంలో, ఐఐటీ విద్యార్థుల సహకారంతో కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను వినియోగించి గోండి, కొలాం భాషలను ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా రూపొందిస్తున్న ప్రయత్నం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడే వినూత్న కార్యక్రమమని పేర్కొన్నారు. నేటి యువత తమ మాతృభాషలను, సంస్కృతి, సంప్రదాయాలను మరువకూడదని, ప్రతి కుటుంబంలో పిల్లలకు మాతృభాషను నేర్పించే బాధ్యత పెద్దలపై ఉందని సూచించారు. గోండి, కొలాం భాషల అభివృద్ధికి అవసరమైన నిధులు ఏవైనా ఉంటే సంబంధిత మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి విడుదల చేయించేందుకు తాను పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు గోండి, కొలాం భాషల్లోనే సభను ఉద్దేశించి మాట్లాడి అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన భాషలను సాంకేతికతతో అనుసంధానం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో ఐఐటీ విద్యార్థుల సహకారంతో ఏఐ ఆధారిత భాషా వేదికను రూపొందిస్తున్నామని వివరించారు. ఈ సాంకేతిక వేదిక ద్వారా గోండి, కొలాం భాషలను నేర్చుకోవడం సులభమవడంతో పాటు ఇతర భాషల వారికి కూడా వాటి అర్థం అవుతుందని తెలిపారు. భాషల పరిరక్షణతో పాటు విద్య, వైద్యం, మౌలిక వసతులు, నిర్మాణం, మార్కెటింగ్, ధర్మం, సంస్కృతి, పరిపాలన తదితర రంగాల్లో ఆదివాసీ సమాజం మరింత అభివృద్ధి చెందేలా ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఆదివాసీ భాషలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. మాతృభాషలను పరిరక్షించడం అంటే మన మూలాలను, మన సంస్కృతిని కాపాడుకోవడమేనని అన్నారు. కార్యక్రమం అనంతరం గోండి–కొలామి పొడుపు కథల పుస్తకాన్ని ఎమ్మెల్యే వెడమ బొజ్జు, ప్రాజెక్టు అధికారి మంద మకరందు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయితలను, భాషా పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఆదివాసీ మేధావులను అభినందించారు.






