18-09-2025 01:18:59 PM
కవితది ఎమోషనల్ నిర్ణయం
ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ పథకాలపై సమీక్ష నిర్వహించాలి
మీడియాతో మండలి చైర్మన్ గుత్తా చిట్ చాట్
నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య,వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. వైద్య రంగానికి ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ పథకాలపై మరోసారి సమీక్ష నిర్వహించాలని తెలిపారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వసతులు తక్కువగా ఉండటం కారణంగా పేదలకు ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేశారని, నేడు తెలంగాణలోని 32 జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మించడం జరుగుతుందన్నారు.
హైదరాబాద్ పట్టణంలో మరో నాలుగు పెద్ద ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మాణంలో ఉన్నావని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ ని అభివృద్ధి చేసి , ఆయా హాస్పిటల్స్ లో పని చేసే డాక్టర్స్ కి ప్రోత్సహకాలు ఇచ్చి మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడలని ప్రభుత్వానికి సూచిస్తున్నానని అన్నారు.హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ నిధులను ఇవ్వాల్సిన అవసరం అప్పుడు ఉండదన్నారు.
ఈ నిధులను ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి వినియోగిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయమని పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ స్కూల్ లు , కాలేజిలు , ప్రభుత్వ విద్యాసంస్థలు మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో, ప్రభుత్వ విద్య సంస్థలలో పని చేసే ఉద్యోగులు బాధ్యతాయుతంగా తమ కర్తవ్యాలను నిర్వర్తించాలని కోరారు. ఎమోషనల్ గా ఉన్నపరిస్థితుల్లో కవిత తన శాసనమండలి సభ్యత్వాన్నిరద్దు చేయాలని తనకు లేఖ పంపించారని చెప్పారు. మానసికంగా ఒత్తిడి ఉన్నకారణంగా పంపించిన రాజీనామా లేఖ పై పునరాలోచించుకోవాలని తాను సూచించినట్లు చెప్పారు.