calender_icon.png 14 February, 2026 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్తికేయ ఇండస్ట్రీస్ మిల్లులో లారీలోకి లోడింగ్ చేస్తున్న హమాలీలు

14-02-2026 10:29:36 AM

లారీ అసోసియేషన్ ఆవరణలో ఉన్న లారీ

బియ్యం అక్రమ రవాణాకు యత్నం

పట్టుకున్న ట్రాన్స్ ఫోర్టు అసోసియేషన్ నాయకులు

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని ఓ మిల్లు నుంచి బియ్యం అక్రమంగా కాకినాడకు తరలిస్తుండగా ఐబీ తాండూరు లారీ అసోసియేషన్ సభ్యులు పట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కార్తికేయ ఇండస్ట్రీస్(Karthikeya Industries mill) కు ఈ ఏడాది సీఎంఆర్ కింద ప్రభుత్వ ధాన్యాన్ని కేటాయించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ మిల్లు నుంచి రాత్రికి రాత్రే ఏపీలోని కాకినాడ పోర్టుకు లారీలకు లారీల బియ్యం తరలించడం మొదలు పెట్టారు. కొత్త మిల్లుకు ఇటీవలనే ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించి ఈ మిల్లుకు ట్యాగింగ్ ఇచ్చారు. సదరు యజమాని కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి బియ్యం పెట్టాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రంగు రంగుల యూరియా బస్తాల్లో ఇతర రాష్ట్రాలకు పంపించి అమ్ముకుంటున్నట్లు తెలిసింది. 

బుధవారం పట్టపగలే ఆంధ్రాకు చెందిన లారీలో బియ్యం లోడింగ్ చేసి రాత్రి అక్రమంగా తరలించే క్రమంలో ఐబీ తాండూరు లారీ అసోసియేషన్ నాయకులు వాహనాన్ని ఆపి ఇక్కడ అసోసియేషన్ ఉండగా ఎలా పెట్టావని నిలదీయగా అసలు ఈ అక్రమ దందా విషయం బయటకు వచ్చింది. అసోసియేషన్ నాయకులు ఆపిన వాహనం ఇప్పటికి అసోసియేషన్ కార్యాలయ ఆవరణలోనే ఉన్నా సదరు మిల్లు యాజమాని కాని, లారీ ఓనర్ కాని అక్కడకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇలా వే బిల్లులు లేకుండా టన్నుల కొద్ది ప్రభుత్వ ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పెద్ద మొత్తంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసోసియేషన్ లారీలను కాకుండా వేరే లారీలను ఉపయోగిస్తుండటంతో అనుమానంతో నాయకులు ఆపగా ఈ దందా విషయం వెలుగులోకి వచ్చింది.

లారీలో ఉన్నవి రేషన్ బియ్యమా..? సీఎంఆర్ బియ్యమా..?

ఐబీ తాండూరు లారీ అసోసియేషన్ నాయకులు పట్టుకున్న లారీలోని బియ్యం రేషన్ బియ్యమా..? లేక సివిల్ సప్లయ్ అధికారులు సీఎంఆర్ కింద కేటాయించిన బియ్యమా..? తేలాల్సి ఉంది. పేద ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణి చేస్తున్న బియ్యాన్ని మిల్లు యజమానులు బ్రోకర్ల సహాయంతో లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త మిల్లులో ప్రభుత్వం సీఎంఆర్ కింద పంపిన ధాన్యం గోనె సంచులు కాకుండా యూరియా, ఇతర ఎరువులకు సంబంధించిన రంగు రంగుల బ్యాగుల్లో బియ్యం లోడ్ చేసి ఉండటంతో ఈ బియ్యం ఎక్కడివనే సందేహాలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులతో పాటు పోలీసులు ఈ విషయంలో విచారణ జరిపితే అసలు బండారం బయటపడుతుందని పలువురు పేర్కొంటున్నారు.