31-12-2025 12:20:54 PM
బెల్లంపల్లి సీఐ శ్రీనివాసరావు
బెల్లంపల్లి డిసెంబర్ (విజయ క్రాంతి): న్యూ ఇయర్ వేడుకలను గొడవలకు అతీతంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ కే. శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆయన వేడుకను పురస్కరించుకొని పత్రిక ప్రకటన విడుదల చేశారు. రోడ్లపై మద్యం తాగి వాహనం నడిపి జైలు కావద్దని,డీజేలు పెడితే చట్ట ప్రకారం కేసులు తప్పవనీ హెచ్చరించారు.
నూతన సంవత్సర వేడుకల పేరుతో అతిగా ప్రవర్తించినా, నిబంధనలు అతిక్రమించినా చట్టపరమైన చర్యలు తప్పవనిన్నారు. డిసెంబర్ 31 రాత్రి పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా యువత వేడుకల పేరుతో చేసే విన్యాసాలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు.
తల్లిదండ్రులకు విజ్ఞప్తి
తమ పిల్లలను నూతన సంవత్సర వేడుకల్లో బయటకు పంపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లి దండ్రులకు ఆయన సూచించారు. తగిన పర్యవేక్షణలో కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని కోరారు. అలా కాకుండా అత్యుత్సాహంతో రోడ్లపైకి వచ్చి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇట్టి విషయాన్ని తల్లిదండ్రులు అందరూ గమనించగలరనీ కోరారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద నిరంతర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలితే ఏమాత్రం ఉపేక్షించకుండా అక్కడికక్కడే వాహనాలను జప్తు చేస్తామని, డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు.
పట్టణ పరిధిలో ఎటువంటి డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్కు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. అధిక శబ్దాలతో ఇరుగుపొరుగు వారికి, వృద్ధులకు, రోగులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన కేసులు నమోదు చేస్తామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, రహదారుల పైన మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు.
రేసింగ్లు చేస్తే క్రిమినల్ కేసులు..
యువత బైక్లపై రేసింగ్లు చేయడం, సైలెన్సర్లు తొలగించి అతి వేగంగా (Rash Driving) ప్రయాణించడం వంటివి చేస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పట్టణ ప్రజల కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.