07-12-2025 12:33:10 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ నిబంధనలు పాటించకుండా, సభ ప్రతిష్టను దిగజారుస్తున్నారని, రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదని, డిప్యూటీ స్పీకర్ నియామకంపై స్పందన లేదని ఆగ్రహం వ్యక్తి చేశారు. సుప్రీంకోర్టు హెచ్చరించినా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు శూన్యం అని, రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం నిబంధనల ఉల్లంఘనే అని హరీశ్ రావు మండిపడ్డారు.
సభను తరచుగా వాయిదా వేస్తూ రూల్ 13, 16లను తుంగలో తొక్కుతున్నారని, క్వశ్చన్ అవర్, జీరో అవర్ ను కుదిస్తూ సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని విరుచుపడ్డారు. డిప్యూటీ స్పీకర్ లేకపోవడంతో ప్రివిలేజ్ కమిటీ పూర్తిగా నిర్వీర్యమైందని, ఎస్టిమేట్స్ కమిటీ ఛైర్మన్ రాజీనామా చేసినా కమిటీని పునరుద్ధరించకపోవడం శోచనీయంగా మారిందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2)ను ఉల్లంఘిస్తూ అనర్హత వేటుపై కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి తెలిపారు. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.