10-12-2024 05:01:48 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): విగ్రహాలపై ఉన్న ధ్యాస విద్యార్థుల భవిష్యత్ పై లేదా..? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస.. విద్యార్థులపై లేదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా కాదు, కనీసం సొంత జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చనిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం దుర్మార్గం అని మండిపడ్డారు.
సీఎం నిర్లక్ష్యం కారణంగా ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలు.. ?, ఎన్ని ప్రాణాలు కోల్పోవాలో..? ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?, పది రోజులు కాకముందే మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలైన దుస్థితి ఏర్పాడిందని హరీశ్ రావు విమర్శించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు.