రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం
- హైకోర్టు తీర్పును స్వాగతించిన మాజీ మంత్రి
- హైకోర్టు తీర్పుతో... రేవంత్ కుట్రలు బట్టబయలయ్యాయి
- ప్రజా సమస్యలు పక్కన పెట్టి రేవంత్ డ్రామాలాడారు.
- ఎవరెన్ని కుట్రలు చేసినా ధర్మం గెలిచిందని వ్యాఖ్య
- కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం
హైదరాబాద్: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై(Justice PC Ghose Commission Report) తెలంగాణ హైకోర్టు తీర్పును(Telangana High Court verdict) మాజీ మంత్రి హరీశ్ రావు స్వాగతించారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన విచారణను హైకోర్టు తప్పుబట్టిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ధర్మం గెలుస్తుందని నిరూపితమైందని తెలిపారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా చేసిన వాఖ్యలు చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయని తెలిపారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయిందని వెల్లడించారు. ఎవరు ఔనన్నా కాదన్నా కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరమని మాజీ నీటిపారుదల శాఖ హరీష్ రావు తేల్చిచెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావులకు ఊరట లభిస్తూ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోకూడదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.






