calender_icon.png 4 June, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్.. ఏపార్టీ నుంచి పోటీ చేస్తావ్?

03-06-2025 01:14:08 AM

  1. నాలుగు ముక్కలాటలో బీఆర్‌ఎస్ నుంచి బీఫామ్ వస్తుందా?
  2. ఈటల, హరీశ్‌రావు భేటీపై పక్కా సమాచారం..చర్చకు సిద్ధమా? 
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై బహిరంగచర్చకు రావాలా..? ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన మాట వాస్తవం కాదా..? కంచె చేను మేసినట్లు ప్రభుత్వ ఆస్తులను నాశనం చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. హరీష్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్ భేటీపై పక్కా సమాచారం తమ వద్ద ఉందని, ఈ విషయంలో హరీశ్‌రావుతో ఎక్కడైనా చర్చకు సిద్ధమే..? అని సవాల్ విసిరారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంద్భరంగా సోమవారం గాంధీభవన్‌లో జాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.. హరీశ్‌రావుకు వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి బీఫామ్ వస్తుందా..? అని ప్రశ్నించారు. నాలుగు ముక్కలాటలో ఏ పార్టీ నుంచి ఆయన పోటీచేస్తారో తెలియదన్నారు.

బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తుపై కవిత చేసిన వ్యాఖ్యలకు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.1.20లక్షల కోట్లు ఖర్చుపెట్టిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికైనా నీరొచ్చిందా..? అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైందన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమబాటలో తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, మెట్టు సాయికుమార్, నూతి శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.