31-05-2025 12:00:00 AM
పదవులు, ప్రాపర్టీల గొడవగా కవిత ఎపిసోడ్
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ప్రాంతీయ పార్టీల్లో ఇద్దరు పిల్లలుంటే ప్రమాదమేనని, చంద్రబాబుకు ఒకే కుమారుడు కావడంతో బతికిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్య లు చేశారు. బీఆర్ఎస్లో డెమోక్రసీ లేదని, ఎమ్మెల్సీ కవితి అసలెందుకు బయటకు వస్తోందని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో నారాయణ మాట్లాడుతూ పదవులు, ప్రాపర్టీల గొడవగా కవిత ఎపిసోడ్ చూస్తున్నామని, ప్రాంతీయ పార్టీలో డెమోక్రసీ లేదని, కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఎక్కువైందన్నారు.
ఆ పార్టీ పదేపదే సీఎంలను ఢిల్లీకి పిలిపించుకుంటుందని, ఇది పరిపాలనపై ప్రభావం పడుతుందని చెప్పా రు. ఎన్నికైన సీఎంకు స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆపరేషన్ కగార్పై ఆయన స్పందించారు. చంపినంత మాత్రాన నక్సలిజం పోదని, ఇంకా పెరుగుతుందన్నారు. మనుషులను చంపగలరేమోగాని, సిద్ధాంతాన్ని చంపలేరన్నారు. ఇది అడవులను ఖాళీ చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నమే ఆపరేషన్ కగార్ అని ఆయన విమర్శించారు.