తెలంగాణలో హెచ్సీసీబీ హై-స్పీడ్ కిన్లే ప్రొడక్షన్ లైన్
హైదరాబాద్, ఏప్రిల్ 18: దేశంలోనే అగ్రగామి ఎఫ్ఎంసీజీ సంస్థ అయిన హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలోని తమ ‘అవిన్య’ (తెలంగాణ గ్రీన్ఫీల్డ్ ఫ్యాక్టరీ) ప్లాంట్లో దేశంలోనే తొలి హై-స్పీడ్ కిన్లే వాటర్ ప్రొడక్షన్ లైన్ను లాంచ్ చేసింది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో ఉన్న ఈ ప్లాంట్, హెచ్సీసీబీకి ఉన్న అత్యంత అత్యాధునిక తయారీ కేంద్రాల్లో ఒకటి. సుమారు 49 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,000 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ఫెసిలిటీలో ఇప్పటికే ఏడు ప్రొడక్షన్ లైన్లు చురుకుగా పనిచేస్తున్నాయి.
ప్రాంతీయంగా కంపెనీ తయారీ సామర్థ్యాన్ని పెంచడంలో ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకం కానుంది. దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీకి సంబంధించి ఇది అత్యంత అధునాతనమైన ప్రొడక్షన్ లైన్. ఉత్పత్తి సామర్థ్యం పరంగా కోకా-కోలా ఇండియా సౌత్వెస్ట్ ఆసియా సిస్టమ్లోనే ఇది అత్యంత వేగవంతమైనదిగా రికార్డు సృష్టించింది. ఈ కొత్త లైన్ ద్వారా నిమిషానికి ఏకంగా 1,350 కిన్లే 500 మి.లీ. పెట్ బాటిళ్లను, అలాగే 1,000 ఒక లీటరు పెట్ బాటిళ్లను ఉత్పత్తి చేయొచ్చు. ఇంతటి వేగంతో ఉత్పత్తి చేయడం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కంపెనీ ఒక సరికొత్త బెంచ్మార్క్ను సెట్ చేసింది.
ఉత్పత్తిలో మరింత కచ్చితత్వం ఉండేలా ఈ ప్రొడక్షన్ లైన్ను పూర్తిగా 'ఇంటిగ్రేటెడ్ ఆటోమేషన్' టెక్నాలజీతో డిజైన్ చేశారు. ఇందులో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాల కోసం మినరల్ ఇంజెక్షన్, ఓజోనైజేషన్ టెక్నాలజీలతో కూడిన అత్యాధునిక వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, నీటిని వృధా చేయకుండా 90% వరకు తిరిగి వాడుకునేలా అధునాతన ‘లామెల్లా ప్యాక్’ సాంకేతికతను ఇందులో వినియోగిస్తున్నారు.
యంత్రాల పనితీరును ఒకేచోట నుంచి పర్యవేక్షించేందుకు ఇందులో ‘హ్యూమన్-మెషిన్ ఇంటర్ఫేస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రొడక్షన్ నిరంతరాయంగా, ఎంతో నమ్మకమైన రీతిలో సాగుతుంది. ప్యాకేజింగ్ నాణ్యతను సుదీర్ఘకాలం కాపాడేందుకు ఇందులో ఒక అధునాతన డోసింగ్ సిస్టమ్ కూడా ఉంది.వీటన్నింటికీ తోడు, విద్యుత్ను భారీగా ఆదా చేసేలా ఈ యంత్రాలను తీర్చిదిద్దారు. ఎప్పటికప్పుడు యంత్రాల పనితీరును అంచనా వేయడం ద్వారా.. డౌన్టైమ్ను (మెషిన్లు ఆగిపోయే సమయాన్ని) తగ్గించి, మార్కెట్ డిమాండ్కు తగ్గట్లుగా ఉత్పత్తిని పెంచడానికి ఇది ఎంతగానో వీలు కల్పిస్తుంది.






