24-06-2025 04:28:25 PM
నటుడు మంచు మోహన్ బాబు పిటిషన్ పై మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణను వచ్చే జూలై 3వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం నేపథ్యంలో 2024 డిసెంబర్ 10న జల్ పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు బయటకు తోసేసి ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మైకు లాక్కొన్ని అతని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామన్ కింద పడ్డాడు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై పహడీ షరీప్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ముందుగా ఆయనపై బీఎన్ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు ఫైల్ చేసి తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదాల్లో పోలీసులు, మీడియా ప్రతినిధులను ఉద్దేశించి గతంలో హైకోర్టు కీలక కామెంట్ చేసింది. వారి కుటుంబ సమస్యను వారే పరిష్కరించుకుంటారని, అలా పరిష్కారించుకోలేని పక్షంలో పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. పోలీసు విచారణకు హాజరుకావాలంటూ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును కొట్టేయాలని మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.