24-06-2025 12:41:31 AM
ఇటీవల రెమ్యునరేషన్స్ విషయంలో నటి సమంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘ఆడ, మగ తేడా లేకుండా అందరికి ఒకే రెమ్యునరేషన్స్ ఇస్తాను, నా నిర్మాణ సంస్థలో అలాగే ఇస్తాను, అందరూ అలాగే ఇస్తే బాగుంటుంది‘ అని తన ’శుభం’ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడింది. ఈ విషయం అప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలోనే అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సైతం థియేటర్లకు జనాల్ని రప్పించేవారికే, మార్కెట్ బేస్ చేసుకొని రెమ్యునరేషన్స్ ఇస్తారని.. ఇందులో ఆడ, మగ అనే తేడా ఉండదని చెప్పారు.
’అందరికీ ఈక్వల్ పే అంటే.. ఒక లైట్ బాయ్ జనాల్ని తెప్పించలేడు కదా’ అంటూ క్లారిటీ ఇచ్చారాయన. తాజాగా కీర్తి సురేశ్(Keerthy Suresh) ఈ ఈక్వల్ పే గురించి మాట్లాడింది. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన ’ఉప్పు కప్పురంబు’(Uppu Kappurambu) సినిమా జులై 4న అమెజాన్ ఓటీటీలోకి రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిందీ ముద్దుగుమ్మ.
ఈ సందర్భంగా సమాన వేతనంపై స్పందిస్తూ.. ‘రెమ్యునరేషన్ అనేది మహిళలు, మగవాళ్లకు సంబంధించింది కాదు. ఇందులోకి ఈక్వాలిటీ తీసుకురావడం అనేది నాకు అర్ధం కాదు. ఒక మేల్ యాక్టర్ థియేటర్ కి జనాల్ని ఎలా రప్పించి మార్కెట్ చేస్తున్నారో, అలా ఒక ఫీమేల్ యాక్టర్ కి కూడా ఉందంటే ఇవ్వొచ్చు. ఒక ఫిమేల్ యాక్టర్ కి జనాల్ని రప్పించే స్టామినా, మార్కెట్ ఉంటే రెమ్యునరేషన్ ఇవ్వొచ్చు.
ఈ హీరోయిన్ తో సినిమా చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి, పెద్ద కలెక్షన్ వస్తాయి అని నమ్మితే ఇవ్వొచ్చు. హీరోకి ఇంత ఇస్తారు, హీరోయిన్ కి ఇంత ఇవ్వలేదు అనేది కాదు. హీరోలాగా ఫిమేల్ యాక్టర్ కూడా జనాల్ని థియేటర్స్ కి తీసుకొస్తే ఇవ్వొచ్చు. హీరోలకు ఇస్తారంటే వాళ్ళని చూసి ఫ్యాన్స్, చాలా మంది వస్తారు కాబట్టి ఇస్తారు‘ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది కీర్తి సురేశ్.