నో పార్కింగ్ బోర్డులు.. అయినా అదే తీరు!
లక్ష్మీపురంలో రోడ్డుపైనే భారీ వాహనాల నిలుపుదల
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులు..
చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
బూర్గంపాడు,(విజయక్రాంతి): పారిశ్రామిక కారిడార్గా ఉన్న లక్ష్మీపురం ప్రాంతంలో ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం బూర్గంపాడు పోలీసులు రెండు రోజుల క్రితం ‘నో పార్కింగ్’ బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే వాటిని ఏర్పాటు చేసినా వాహనదారుల తీరులో మార్పు కనిపించడం లేదు. రోడ్డుకు ఇరువైపులా ఇష్టానుసారంగా వాహనాలను నిలిపివేస్తూ పోలీసుల నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు.
బోర్డులు ఉన్నా..
ప్రధాన రహదారిపై భారీ వాహనాలను నిలిపివేయడంతో ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రద్దీ సమయంలో వాహనాలు ఎదురెదురుగా వెళ్లే క్రమంలో ప్రమాదాలకు అవకాశం ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసినా వాటిని పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చర్యలతోనే క్రమశిక్షణ
కేవలం నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసి వదిలేయకుండా నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై జరిమానాలు విధించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. అప్పుడే వాహనదారుల్లో క్రమశిక్షణ వస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేకంగా పర్యవేక్షించి రహదారిపై వాహనాల నిలుపుదలను అరికట్టాలని కోరుతున్నారు. మరి ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే.






