అక్రమ ఇసుక రవాణాను అడ్డెది
పంటలను ధ్వంసం చేస్తున్న ఇసుక మాఫియా
ఇసుక రవాణా అరికట్టాలని రైతుల డిమాండ్
రాజాపూర్: రాజాపూర్ మండలంలో దుందుభి వాగు పరివాహక ప్రాంతాల గ్రామాలలో ఇసుక అక్రమ రవాణా సాగుతున్న పట్టించుకునే నాధుడే లేడన్న చందంగా మారింది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా యదేచ్చగా సాగిస్తున్నారు. రాజపూర్ మండలం నుంచి ప్రతినిత్యం 50 టిప్పర్ పైన ఇసుక లోడుతో వెళ్లి పట్టణాలలో అమ్ముకొని సోమ్ముచేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా కొరకు పచ్చని పంటపొలాలను కూడా ధ్వంసం చేసి తమ ఇసుక దందాను సాగిస్తున్నారు.
మల్లేపల్లి, రాయపల్లి శివారులోని దుందుభి వాగు నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా మట్టిని కడిగి ఫిల్టర్ ఇసుకను తయారు చేసి టిప్పర్ల ద్వారా రాజధానికి తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రైతులు భాస్కర్ రెడ్డి, పరిసప్రాంతాల్లో ఉన్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వరి సాగు చేస్తున్నామని మడులలో నుంచి వాహనాలు వెళుతున్నాయని వరి నారు పూర్తిగా దెబ్బతింటుందని పేర్కొన్నారు. పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని రైతులు తెలిపారు.






