16-06-2025 02:01:38 AM
న్యూఢిల్లీ, జూన్ 15: అహ్మదాబాద్ ఘోర ప్రమాదం మరువక ముందే ఆదివారం ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం కేదార్నాథ్ ధామ్ నుంచి గుప్తకాశీకి వెళ్తున్న హెలికాప్టర్ గౌరీకుండ్ అడవుల్లో కుప్పకూలింది. గడిచిన ఆరువారాల్లో భారత్లో ఇది ఆరో విహంగ ప్రమాదం. ఉదయం 5.17కు ఆరుగురు ప్రయాణికులు, హెలికాప్టర్ పైలట్తో కేదార్నాథ్ నుంచి గుప్తకాశీకి బయలుదేరగా.. మార్గమధ్యలోనే కుప్పకూలిపోయింది.
ప్రతికూల వాతావరణం వల్లే ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ను ఆర్యన్ ఏవియేషన్ సంస్థ నడుపుతున్నట్టు తేలింది. హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అర్పన్ యదువంశీ నేతృత్వంలోని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. చనిపోయిన వారిలో రాజ్వీర్ (37) [హెలికాప్టర్లో పైలట్ ], విక్రమ్ రావత్ (46), వినోద్ (66), త్రిష్టి సింగ్ (29), రాజ్కుమార్ సురేష్ (41), శ్రద్ధ (35), రాశి (10) ఉన్నారు.
హెలికాప్టర్ సర్వీసులు నిలిపివేత
ఘోర ప్రమాదంతో ఉత్తరాఖండ్ సర్కారు అలర్ట్ అయింది. కేదార్నాథ్ యాత్రకు హెలికాప్టర్ సేవలను రెండు రోజుల పాటు నిలిపివేయనున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ప్రయాణికుల భద్రతే రాష్ట్రానికి మొదటి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ హెలికాప్టర్ ప్రమాదంపై సీఎం ధామి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘ఈ ఉదయం ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. విషయం తెలిసిన వెంటనే అత్యవసర సమావేశానికి ఆదేశించా. డీజీసీఏ నిబంధనలు ఉల్లంఘించకూడదని ఆదేశాలిచ్చా.’ అని తెలిపారు.
ప్రమాదం గురించి అన్వేషించేందుకు ఉన్నతస్థాయి టెక్నికల్ కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్రంలో సేవలందిస్తున్న హెలికాప్టర్లలో భద్రత, సాంకేతిక అంశాలను తనిఖీ చేయాలని సూచించారు.
ఆర్యన్పై తాత్కాలిక నిషేధం
ఆర్యన్ ఏవియేషన్ కార్యకలాపాలపై పౌరవిమానయాన శాఖ తాత్కాలిక నిషే ధం విధించింది. ఇద్దరు హెలికాప్టర్ పైలట్ల లైసెన్సులను కూడా ఆరునెలల పాటు రద్దు చేశారు. ఈ హెలికాప్టర్ ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు జరుపుతోంది. ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అథారిటీ (యూసీఏడీఏ) కమాండ్ రూమ్ పనితీరును సమీక్షించేందుకు నైపుణ్యం కలిగిన అధికారులను వెంటనే నియమించాలని పౌరవిమానయాన శాఖ డీజీసీఏని ఆదేశించింది.