17-06-2025 11:47:36 PM
హైదరాబాద్ (విజయక్రాంతి): ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్(Telangana Bhavan)లో ప్రత్యేక హెల్ప్లైన్ను ప్రారంభించింది. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి లభించిన తాజా సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన ఎవరూ ప్రభావితమైనట్టు సమాచారం లేదని మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
అయినప్పటికీ, భవిష్యత్ పరిణామాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. సహాయం కోసం ప్రజలు ఈ నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. వందన, పి.ఎస్, రెసిడెంట్ కమిషనర్ 91 9871999044, జి.రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ 91 9643723157, జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్ 91 9910014749, సిహెచ్. చక్రవర్తి, పౌర సంబంధాల అధికారి 91 9949351270.