30-05-2025 12:58:01 AM
ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు
ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి
*విజయక్రాంతి*తో ఉద్యానశాఖ అధికారి సోమేశ్వరరావు
సంగారెడ్డి, మే 29(విజయక్రాంతి):ఉద్యాన పంటల సాగు కొరకు జిల్లా రైతులకు 2025 - 26 వార్షిక ప్రణాళిక ఖరారు చేసినట్టు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పి.సోమేశ్వరరావు తెలిపారు. ఆయన గురువారం *విజయక్రాంతి*తో మాట్లాడారు. ఉద్యాన పంటలతో తక్కువ ఖర్చుతో నిత్యం అధిక లాభాలు అర్థించవచ్చని, ప్రభుత్వం ఉద్యాన పంటల సాగు కొరకు విరివిగా రాయితీలు అందిస్తుందని తెలిపారు.
అకాల వర్షాల కారణంగా నష్టాలు చవిచూసి తక్కువ ఆదాయం గల పంటల సాగు చేస్తున్న రైతులు పంట మార్పిడి చేసి అధిక ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటల ద్వారా అధిక లాభాలు అర్జించే ఉద్యాన పంటల సాగు చేయడం మేలని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం మంచి రాయితీలను కల్పిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశంతో 2025-26 వార్షిక ప్రణాళిక అమలు ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు.
బిందు సేద్య పథకం (డ్రిప్)..
బిందు సేద్య డ్రిప్ పరికరాల కొరకు జిల్లాకు మొదటి విడతగా రూ.2478.85 లక్షల అంచనాలతో 2155 హెక్టార్ల భౌతిక లక్ష్యం కేటాయించబడింది. షెడ్యూల్ కులాలు,షెడ్యూల్ తెగల రైతులకు 100 శాతం, వెనుకబడిన తరగతులు, చిన్న సన్నకారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీ కల్పిస్తున్నారు. డ్రిప్ కొరకు రైతులు తమ సమీప మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
తుంపర సేద్య పథకం (స్ప్రింక్లర్స్)...
స్ప్రింక్లర్ పరికరాల కొరకు జిల్లాకు మొదటి విడతగా రూ.88.33 లక్షల అంచనాలతో 465 హెక్టార్ల భౌతిక లక్ష్యం కేటాయించబడింది. అన్ని వర్గాలకు 75 శాతం రాయితీ కల్పిస్తున్నారు.
ఆయిల్ ఫామ్ సాగు...
కోతులు, దొంగల బెడదలేని ఏకైక పంట ఆయిల్ ఫామ్ సాగును జిల్లాలో ఈ సంవత్సరం 3750 ఎకరాలలో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆయిల్ కంపెనీలైన గోద్రెజ్ కంపెనీ మొక్కలు అందిస్తుంది. మొక్కలు రాయితీతో పాటు నిర్వాహణ రాయితీ, పంటలకు గాను రూ.38,318 రాయితీ చొప్పున కల్పిస్తున్నారు.
సమీకృత ఉద్యాన మిషన్ పథకం...
డ్రాగన్ ఫ్రూట్, అరటి, అంజీర, అవకాడో, బొప్పాయి, ఉసిరి, మామిడి, నిమ్మ, జామ, హైబ్రిడ్ కూరగాయలు, పూల తోటల పెంపకానికిగాను 571 హెక్టార్లలో రాయితీ కల్పించబడుతుంది. ముదురు మామిడి తోటల పునరుద్ధారణ కొరకు 16 హెక్టార్లు, మల్చింగ్ షీట్ వేసుకున్నందుకు 520 హెక్టార్లు, ప్యాక్ హౌస్ లకు 14 యూనిట్లు, యాంత్రీకరణకు 265 యూనిట్లు, ఫ్రూట్ కవర్లకు 19 హెక్టార్లు, విడ్మెట్ కొరకు 56 వేల స్క్వేర్ మీటర్లు లక్ష్యంగా కేటాయించారు.
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం...
కూరగాయల సాగు పెంచడం కొరకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా శాశ్వత పందిరి నిర్మాణం కొరకు రూ.50,000 ఒక యూనిట్కు, ఆర్థిక కేటాయింపుతో 100 యూనిట్ల లక్ష్యాన్ని కేటాయించబడింది.
జాతీయ వెదురు మిషన్ పథకం...
సాగును ప్రోత్సహించడం కొరకు ప్రభుత్వం వెదురు మొక్కలు నాటినందుకు రాయతి కల్పిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాకు 5000 మొక్కలు రూ.7.50 లక్షలు ఆర్థిక లక్ష్యంగా కేటాయించినట్లు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సోమేశ్వరరావు తెలిపారు.