30-05-2025 12:56:59 AM
- సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు
- దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ, మే 29 : దేవరకొండకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ధన్యవాదాలు తెలిపారు.
దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మన రాష్ర్ట బిడ్డలు ఈ రాష్ట్రానికే కాదు, దేశానికి, ప్రపంచానికి మార్గదర్శకంగా ఎదగాలన్న ఆశయం ప్రజా ప్రభుత్వానికి ఉందని, ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు రూ.200 కోట్లు, 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించడమే లక్ష్యమని వారు అన్నారు.
ప్రతి వర్గానికి విద్య ద్వారా సమానావకాశాలు కల్పించాలన్న సంకల్పంతో సమ సమాజ నిర్మాణం వైపు సీఎం ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభు త్వం ముందడుగు వేస్తుంది అని అన్నారు. గ్రామీణ ప్రాంత పిల్లలకు ప్రపంచ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఒక అత్యాధునిక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నాం అని పేర్కొన్నారు.
ఈ క్రమంలో దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం కొలముంతల్ పహాడ్ గ్రామ సమీపంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో 25 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి త్వరలో రాష్ర్ట ఉప ముఖ్య మంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క తో కలిసి శంకుస్థాపన చేస్తాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు కృష్ణయ్య, మాజీ జడ్పీటీసీ మారుపాకల అరుణ సురేష్ గౌడ్, మాజీ ఎంపీపీ ఏడ్పుల గోవింద్ యాదవ్, సీనియర్ నాయకులు హన్మంతు వెంకటేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.