14-06-2025 04:46:53 PM
నేర నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి..
దాబాలు వద్ద ప్రమాదాలు జరగకుండా తగు నివారణ చర్యలు తీసుకోవాలి..
హోటల్స్ వద్ద అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు..
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): జిల్లాలో హైవేల పైన ఉన్నటువంటి హోటల్స్, దాబాలు, రెస్టారెంట్లలో అసాంఘిక కార్యక్రమాలు, ప్రమాదాల నివారణ, నేర నియంత్రణకు పోలీసు వారి సూచనలు, నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharath Chandra Pawar) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లాలో హైవే పైన ఉన్న హోటల్స్, దాబాలు, రెస్టారెంట్ల నిర్వహకుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో హైవే పైన ఉన్నటువంటి అన్ని దాబాలు, హోటల్స్లో వారికి ఎదురయ్యే సమస్యల గురించి అడిగి తెలుసుకొని మాట్లాడుతూ.. ప్రతి హోటల్, దాబాలో కచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా దొంగతనాలు, నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు.
అలాగే హోటల్స్, దాబాలు వద్ద వాహనదారులు ఆగే సమయంలో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నియంత్రణకు హైవే పైన వాహనాలు నిలపకుండా, హోటల్స్ వద్ద సరైన పార్కింగ్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, రాంగ్ రూట్ ప్రయాణ నియంత్రణకు సంబంధిత హోటల్స్ వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోని, వాహనదారులకు తగు సూచనలు తెలియజేయాలని సూచించారు. దాబాలు వద్దకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పోయే వాహనదారుల వివరాలు తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ ప్రతి రోజు తెలియజేయాలని అన్నారు.
దాబాలు, హోటల్స్లో మద్యం, గంజా విక్రయించడం, సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ప్రతి హోటల్, దాబాలో మద్యం సేవించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి మద్యం గంజా ఇతర మత్తు పదార్దాలు తీసుకొని వచ్చి సేవిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ కి గాని డయల్ 100 కి సమాచారం అందిస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సిఐ రాఘవరావు, యస్బి సీఐ రాము, యస్.ఐ సైదులు, హోటల్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.