calender_icon.png 15 June, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలగించాల్సిందే... తొలగించేది లేనేలేదు

14-06-2025 04:50:23 PM

-ఆర్టీసీ ముందు తోపుడు బండ్లను తీయండి: ఆర్టీసీ 

-తొలగించేందుకు జెసిబిని తెచ్చిన మున్సిపల్ అధికారులు 

-ఘటన స్థలానికి చేరుకుని అందరూ బతకాలి అంటున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహబూబ్ నగర్ లో ఆర్టీసీ బస్టాండ్ ముందు అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే మార్గంలో మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District) కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ పదుల సంఖ్యలో ప్రత్యేకంగా కమర్షియల్ షెటర్లను నిర్మాణం చేపట్టారు. నిర్మాణం తుది దశకు చేరడంతో ఆయా షాపులకు ఆర్టీసీ అధికారులు టెండర్లు వేశారు. ఆసక్తి గల వ్యక్తులు ఒక షాప్ కు రూ 30 వేల నుంచి ఆ పైగా నెలకు అద్దెను చెల్లిస్తామని టెండర్లు వేసి కొందరు దక్కించుకున్నారు.

ఈ క్రమంలో నెలకు ఆర్టీసీకి దాదాపుగా రూ 10 లక్షల పైగానే ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్న సమస్య అంత ఇప్పుడే వచ్చింది. ఈ షాపుల ముందు కొన్నేళ్లగా కొందరు తోపుడు బండ్లను ఉంచుకొని ప్రత్యేకంగా పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించారు. అప్పుడు ఆర్టీసీ అధికారులు వీరిని తొలగించాలని ఆదేశించలేదు. బతుకుతున్నారు కదా బతుకుని అనుకున్నారో ఏమో తెలియదు గానీ.. ఏండ్ల తరబడి వారు అక్కడే అరటి, ఆపిల్, అంగూర్, జామ పండ్లతో పాటు వివిధ రకాల పండ్లను విక్రయించుకుంటూ వస్తున్నారు. 

- షాపులకు ముందు పండ్ల వ్యాపారం...

తాము ఏండ్ల తరబడి పండ్ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని అక్కడ విక్రయించుకుంటున్న పండ్ల వ్యాపారస్తులు మొరపెట్టుకుంటున్నారు. ఆర్టీసీ అధికారులు మున్సిపల్ అధికారుల సహాయంతో పండ్ల షాపులను తొలగించాలని జెసిపి ని ఆ పండ్ల షాపుల దగ్గరికి శనివారం ఉదయం తీసుకువచ్చారు. పండ్ల షాపులను తొలగించాలని ఆర్టీసీ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు చెప్పారు లేనియెడల జెసిబి తో తొలగిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనను మరింత తీవ్ర రూపం దాల్చడంతో పండ్ల వ్యాపారులు జెసిబి ముందు బైఠాయించి నిరసన కొనసాగించారు. 

- ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

ఆర్టీసీ అధికారులు తీరు సరిగా లేదని.. ఏళ్ల తరబడి పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు ఇప్పటికిప్పుడు ఎక్కడ పోయి వ్యాపారం చేసుకుంటారని ఆర్టీసీ అధికారులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించినట్లు పండ్ల వ్యాపారస్తులు చెప్పారు. షాపుల ముందు ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం చేపట్టి ఉంచితే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారులకు చెప్పారు. అందరూ బతికేలా నిర్ణయాలు ఉండాలని, ఏకపక్షంగా ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకోవడం సరికాదని ఎమ్మెల్యే హెచ్చరించారు. దశాబ్దల తరబడి పండ్ల వ్యాపారం చేసుకునేవారు ఎక్కడికి వెళ్లి బతుకుతారని ప్రశ్నించారు. పండ్ల వ్యాపారాలను తొలగించకూడదని ఎమ్మెల్యే చెప్పారు. 

-ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం..

ఆర్టీసీ షాప్ల  ముందు పండ్ల బండ్లను ఉంచితే వ్యాపారం ఎలా చేసుకుంటారు. మరో మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని ప్రత్యేకంగా సంప్రదించి విషయాన్ని పూర్తి స్థాయిలో వివరిస్తాం. ఆర్టీసీ స్థలంలో ప్రైవేట్ వ్యాపారులు వ్యాపారం చేసుకుంటే అద్దెకిచ్చిన చాపల వారికి ఇబ్బంది అవుతుందని చెబుతాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. 

 -సంతోష్ కుమార్, ఆర్టీసీ ఆర్ఎం, మహబూబ్ నగర్