జనసంద్రంగా యాదగిరి క్షేత్రం
ధర్మ దర్శనానికి మూడు గంటలు
స్పెషల్ దర్శనానికి రెండు గంటలు
యాదగిరిగుట్ట, ఆగస్టు 30 (విజయ క్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుండి రాత్రి వరకు యాదగిరి కొండ భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు కావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. యాదగిరిగుట్ట కొండపైన వాహనాల రద్ది పెరగడంతో కొండపైకి ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహనాలను అనుమతించలేదు. కొండ కింద రింగురోడ్డులో వాహనాలతో పరిసరాలన్నీ నిండిపోయాయి. ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. స్వామివారి దివ్య క్షేత్రంలో నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సుప్రభాత సేవతో స్వయంభులను మేల్కొల్పిన అర్చకులు గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్టమూర్తులను వేదమంతోత్సవములతో అభిషేకం అర్చన,ప్రాకారమంటపంలో సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం పండితులు ఘనంగా నిర్వహించారు. భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని మొక్కలను చెల్లించుకున్నారు. సాయంత్రం స్వామివారి వెండి జోడు సేవలో స్వామివారిని అలంకరించి తిరువీధులలో ఊరేగించారు. కొండపైన అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర శివాలయంలో నిత్య కైంకర్యాలను పండితులు నిర్వహించారు. స్వామివారి నిత్య రాబడి 44,13,428/-యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కు వివిధ శాఖల నుండి వచ్చిన ఆదాయం 44,13,428/- వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.






