calender_icon.png 7 June, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇండ్లు

05-06-2025 12:55:19 AM

  1. దశలవారీగా మంజూరు చేస్తాం: మంత్రి పొంగులేటి
  2. ఏదులాపూర్‌లో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ

ఖమ్మం, జూన్ 4 (విజయక్రాంతి): అర్హులైన నిరుపేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కొనసాగుతుం దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను  కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్‌లతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ధ పేద ప్రజల ఇండ్లపై పెట్టలేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించిందని విమర్శించారు. రూ.22, 500 కోట్లను పేద ప్రజల సొంతింటి కల కోసం తమ ప్రజా ప్రభుత్వం ఈ సంవత్సరం కేటాయించిందని, ఆర్థికంగా ఇబ్బం దులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమమే అజెండాగా పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు.

గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, చెంచులకు పూర్తి స్థాయిలో మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు.

ప్రస్తుతం ప్రజలకు అందించే ఇండ్లు మొదటి విడత మాత్రమేనని, ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉంటుందన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో ప్రస్తుతం 520 మందికి ఇల్లులు మంజూరు చేశానమి, ఇంకా అర్హులున్నారని, వారికి కూడా ఇస్తామని చెప్పారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.

రైతులకు దాదాపు రూ.21 వేల కోట్లు ఖర్చు చేసి 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ అందించామని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో నరసింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రావు, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్ పాల్గొన్నారు.