07-06-2025 02:13:55 AM
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు
మెదక్, జూన్ 6(విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతే మెదక్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. శుక్రవారం హవేలి ఘనపూర్ మండల్ ఫంక్షన్ హాల్ నందు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 450 మంజూరి పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు పదేళ్ల కాలంలో కనీసం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని, ఈరోజు మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మండలానికి వెళ్లినా గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు దర్శనమిస్తాయని తెలిపారు. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఒకలాగా చేసే పద్ధతి మా ప్రభుత్వానికి లేదని, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుని లాగా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.
గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉండేదని, నేడు అన్ని పాఠశాలల్లో కూడా బాత్రూంలు నిర్మించి ఉపయోగానికి తీసుకురావడం జరిగిందన్నారు. ఏడుపాయల దేవస్థానానికి గత ప్రభుత్వం నిధులు ఇస్తామని మాటలతో సరిపెట్టిందని, తాను గెలిచాక 14 నెలల కాలంలో ఏడుపాయల టెంపుల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి దర్శన భాగ్యం కల్పించామన్నారు.
విద్య, వైద్యం ప్రధాన అజెండాగా చేసుకునే పిల్లలకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించాలని, రామాయంపేట మెయిన్ రోడ్ లో 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించుకునే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, ఎంపీడీవో, డీఈ యాదగిరి, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులుపాల్గొన్నారు.