calender_icon.png 30 June, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు?

30-06-2025 02:05:09 AM

  1. ప్రచారం కోసమే బీజేపీ నేతల పాట్లు
  2. బడ్జెట్ కేటాయింపులు లేకుండా బోర్డు ఉండి ఏం లాభం?
  3. రేవంత్‌రెడ్డిది అవినీతి పాలన అని అమిత్‌షా అంటున్నరు?
  4. మరి విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?
  5. ‘ఎక్స్’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): ‘నిజామాబాద్‌లోని పసుపు బోర్డును జనవరి 14న కేంద్ర మంత్రి పియూష్‌గోయల్ వర్చువల్‌గా ప్రారంభిం చారు. తిరిగి అదే బోర్డును తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. కేవలం ప్రచారం కోసమే బీజేపీ నేత లు బోర్డును మళ్లీ మళ్లీ ప్రారంభిస్తున్నారు. కనీసం బోర్డు సొంత భవనమైనా లేదు.

బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయ డం ఎంతవరకు సమంజసం? బోర్డుకు కేంద్ర బడ్జెట్‌లో రూపాయైనా విదిల్చకుండా ప్రారంభోత్సవాల వల్ల ఏమిటి ప్రయోజనం? తెలంగాణలో అవినీతి పాలన నడుస్తున్నదని అమిత్‌షా వ్యాఖ్యలు చేశారు. అదే నిజమైతే సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై ఎందుకు విచారణ జరిపించడం లేదు’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్’లో నిలదీశారు.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మారిందని హోం మంత్రి అమిత్‌షా ఆరోపిస్తున్నారని, ఆ అవినీతి లెక్కలు తేల్చేందుకు సీబీఐ, ఈడీతో ఆయన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ని ఒంటరిగా ఎదుర్కోలేకనే.. సీఎం రేవంత్‌రెడ్డిని బీజేపీ పావుగా వాడుకుంటున్నదని విమర్శించారు. ప్రధాని మోదీ, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ-, సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఆర్‌ఆర్ టాక్స్ వసూలుచేస్తున్నారని ఆరోపించారు.

బీజేపీకి దమ్ముంటే సీఎం అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, అవినీతి లెక్కలు తేల్చాలని సవాల్ విసిరారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వారిలో ఇద్దరు కేంద్రమం త్రులని.. ఇంతమంది ఉండి కూడా.. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీ య హోదా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు.

కనీసం ఒక్క ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కాలేజీనైనా తీసుకురాలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని నాలుగు కోట్ల ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల పేరుతో జల దోపిడీకి సిద్ధమవుతున్నా, తెలంగాణ రైతుల హక్కులను కాలరాస్తున్నా బీజేపీ ఎంపీల్లో స్పందన లేదని దుయ్యబట్టారు. కేంద్రం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నదని, కానీ.. దాని నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని హితవు పలికారు.