19-06-2025 01:30:56 AM
- గయానాలో కనుగొన్న ఆయిల్ రిజర్వ్కు సమానం
- దాదాపు 2 లక్షల కోట్ల నిల్వలు ఉన్నట్టు అంచనా
- చమురు నిల్వలపై ఆందోళన అవసరం లేదు
- ఇప్పటికే తవ్వకాలు ప్రారంభించాం: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్
న్యూఢిల్లీ, జూన్ 18: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు నిల్వలపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. బంగాళా ఖాతంలో భాగమైన అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో భారీ చమురు నిక్షేపాలు ఉన్న ట్టు తెలిసిందన్నారు. మంగళవారం పెట్రోలియం, సహజ వాయువులు, ఇంధన శాఖ కు సంబంధించిన అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సంద ర్భంగా హర్దీప్ సింగ్ మాట్లాడుతూ.. ఇటీవల దక్షిణ అమెరికాలోని గయానాలో కనుగొన్నంత ఆయిల్ రిజర్వ్ అంత మొత్తం లో అండమాన్లో చమురు నిక్షేపాలు ఉండొచ్చన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ అండమాన్ దీవుల్లో చమురు, సహజవాయువు కోసం తవ్వకాలు ప్రారంభించాయన్నారు. భారత్ 80 శాతం చమురు, 50 శాతం సహజ వాయువును దిగుమతి చేసుకుంటుందని.. ఒకవేళ అండమాన్లో చము రు నిక్షేపాలు అందుబాటులోకి వస్తే మాత్రం భారత్ గేమ్ చేంజర్గా మారిపోయే అవకాశముందన్నారు.
అయితే అండమాన్ సము ద్రంలో చమురు వెలికి తీయడం బాగా ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు. ఒక్కో బావి తవ్వడానికి దాదాపు 10 కోట్ల డాలర్లు (సుమారు రూ. 850 కోట్లు) ఖర్చవుతుందని తెలిపారు. గయానాలో కూడా కొత్త చమురు నిక్షేపాల కోసం 44 బావులు తవ్వా ల్సి వచ్చిందని.. దీనికోసం అక్కడ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఓఎన్జీసీ చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం రూ. 37 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇందులో ఎక్కువ భాగం అండమా న్, నికోబార్ సముద్ర జలాల్లో బావులు తవ్వకానికి ఉపయోగించారని మంత్రి తెలిపారు.
2 లక్షల కోట్ల లీటర్ల చమురు నిక్షేపాలు
అయితే అండమాన్ సముద్రంలో దాదా పు రెండు లక్షల కోట్ల లీటర్ల చమురు నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఇది సుమారు 1160 కోట్ల బ్యారెళ్లకు సమానం. గయానాలో కనుగొన్న చమురు నిక్షేపాల విలువ కూడా ఇంతే మొత్తంలో ఉంటుంది. అక్కడ హెస్ కార్పొరేషన్, చైనాకు చెందిన సీఎన్ఓఓసీ కంపెనీలు ఈ నిక్షేపాలను కనుగొన్నా యి. దీంతో గయానా ప్రపంచంలోనే 17వ అతిపెద్ద చమురు నిక్షేపాలు కలిగిన దేశంగా అవతరించింది.
మూడు నెలలకు సరిపడా నిల్వలు
ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా దేశం లో ముడి చమురుకు కొరత లేదని, ప్రస్తుతం మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు.