19-06-2025 01:32:41 AM
-ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం
-ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం
-బాలికి వచ్చే భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా విమానాల రద్దు
న్యూఢిల్లీ, జూన్ 18: ఇండోనేషియాలోని లెవోటోబి లకి| అగ్నిపర్వతం బద్దలవ్వడంతో దానికి సమీపంలో బాలికి వెళ్లే ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి తిరుగుపయనమైన విమానం బుధవారం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయినట్టు అధికారులు పేర్కొన్నారు. అగ్నిపర్వతం బద్దలైన నేపథ్యంలో భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్టు తెలిపారు.
అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తూర్పు ఇండోనేషియాలోని నుసా టెంగారా ప్రావిన్స్లోని విమానాశ్రయాన్ని మూసివేశారు. మంగళవారం బద్దలైన లెవోటోబి లకి లకి అగ్ని పర్వతం నుంచి 11 కిలోమీటర్ల ఎత్తులో బూడిద ఎగసిపడినట్టు పీవీఎంబీజీ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం మరోసారి విస్పోటనం సంభవిం చడంతో స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నిర్వహణ సమస్యతో మరో విమానం రద్దు
విమానాల మళ్లింపులు, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా నిర్వహణ సమస్యతో ముంబై నుంచి లక్నోకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని రద్దు చేసినట్టు ఆ సంస్థ తెలిపింది. ప్రయాణికులకు ఎయిర్పోర్టులో బస ఏర్పాటు చేసి బుధవారం వారిని తమ గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది.