02-07-2025 08:44:02 PM
వేడుకల్లో పాల్గొన్న ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షులు జె.ఎస్ సింగార్
కోదాడ: కోదాడలో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్(Indian Veterans Organization) జాతీయ అధ్యక్షుడు జే. ఎస్. సింగార్, రాష్ట్ర అధ్యక్షుడు ఉజ్జిని రవీందర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గుండా మధుసూదన్ రావు అన్నారు. కోదాడ పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మాజీ సైనికులతో ఏర్పడిన మొట్టమొదటి జాతీయ జెండా రాష్ట్రంలో ఇదేనని వారు తెలిపారు. దేశభక్తి పెంపొందించేలా జాతీయ జెండా ఏర్పాటుకు కోదాడ వాసులు ఆర్థిక సాయం చేయడం వారి దేశభక్తికి నిదర్శనం అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి ఎన్ సీ సీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని దేశభక్తి నృత్యాలతో కవాతులు చేస్తూ అలరించారు. అంతకుముందు కార్గిల్ యుద్ధ వీరుడు గోపయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు. గోపయ్య విగ్రహం వద్ద నుంచి వంద అడుగుల జాతీయ జెండా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్ రామారావు, జనరల్ సెక్రటరీ ఉపేందర్, ట్రెజరర్ వెంకన్న, పురపాలక మాజీ చైర్ పర్సన్ ప్రమీల, రమేష్, ప్రవలిక, ప్రగతి నాగేశ్వరావు, సలీం షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.