02-07-2025 08:50:34 PM
సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య పేరిట అక్రమంగా అమ్ముతున్న పుస్తకాలను అధికారులు బుధవారం సీజ్ చేశారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని హైవే కి ఆనుకొని ఉన్న శ్రీ చైతన్య పాఠశాల(Sri Chaitanya School)కు అతి సమీపంలోని ఒక రూములో శ్రీ చైతన్య పేరిట పుస్తకాలను పెట్టి అక్రమంగా అమ్ముతున్నారని తెలియడంతో అక్కడికి వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. అక్కడ రెండు రూమ్ లలో వేలకొద్దీ పుస్తకాలు ఉన్నాయని వీటి విలువ లక్షల రూపాయలు ఉంటుందన్నారు. వీటిని ఒకటి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5-7 వేల వరకు అమ్ముతున్నట్లు తెలిపారు.
ఇదే విషయంను మండల విద్యాధికారులు, పోలీసులకి తెలియపరచగా అక్కడికి చేరుకొని వాటిని సీజ్ చేసినట్టు తెలిపారు. జిల్లాలోని చాలా ప్రైవేట్ పాఠశాలలో ఇదేతంతు కొనసాగుతుందని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతున్నందున జిల్లా అధికారులు స్పందించి ఈ అక్రమ పుస్తకాల అమ్మకాలను కట్టడి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు శ్రీకాంత్, నవీన్, మహేష్ పలువురు బీసీ, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.