అనుమానం భార్య ప్రాణం తీసింది
హైదరాబాద్: భార్య నడవడికపై అనుమానంతో ఆదివారం రాత్రి సిద్దిపేటలోని(Siddipet) ఆదర్శ్ నగర్ కాలనీలో ఒక వ్యక్తి తన భార్యను చంపి, ఆ తర్వాత తన కుమార్తెపై దాడి చేసి, చివరకు తనను తాను తీవ్రంగా గాయపరుచుకున్నాడు. ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఎల్లయ్య తన భార్య శ్రీలత (40)ను కత్తితో పలుమార్లు పొడిచి తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం.
తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తరువాత, అతను వారి కుమార్తె అర్చనపై రోకలితో దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఎల్లయ్య కూడా తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు అర్చనను, ఎల్లయ్యను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.




