21-07-2025 01:05:32 AM
బెజ్జంకి, జూలై 18: ఆగని బస్సులు... ప్రాంగణం వెలవెల అనే శీర్షికతో జూలై 4న విజయక్రాంతి దినపత్రికలో ప్రచురితమైన కథనం తెరపైకి తీసుకొచ్చిన సమస్యకు ప్రభుత్వం స్పందించింది. హుస్నాబాద్ నుండి ఇల్లంతకుంట, బెజ్జంకి మీదుగా వేములవాడకు ఆర్టీసీ బస్సు సేవలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ధరించారు.
కరీంనగర్ డిపో నుంచి నడిచే బస్సు రద్దుతో ఇల్లంతకుంట మండలానికి చెందిన ప్రయాణికులు ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని విజయక్రాంతి ప్రత్యేకంగా వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ జూలై 17న కోహెడ మండల కేంద్రంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కొత్త బస్సు ఉదయం 6 గంటలకు హుస్నాబాద్ నుండి బయలుదేరి 7.10కి బెజ్జంకికి చేరుకుంటుంది. అనంతరం ఇల్లంతకుంట మీదుగా 8.50కి వేములవాడకు చేరుకుంటుంది. సాయంత్రం తిరిగి అదే మార్గంలో హుస్నాబాద్ చేరుతుంది. ఈ సేవ పునరుద్ధరణతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
విజయక్రాంతి కథనంపై మంత్రి స్పందించి, ప్రజల నిత్య ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవడాన్ని ప్రశంసిస్తూ స్థానికులు విజయక్రాంతి దినపత్రికపై అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు. ప్రజల గొంతుకగా నిలిచిన కథనం విజయక్రాంతి ప్రచురించిందని ప్రజల నుండి కృతజ్ఞతలు వెల్లువెత్తున్నాయి.