calender_icon.png 21 July, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోతే మీ రాతి గుండె కరుగుతుంది

21-07-2025 03:28:55 PM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నాగల్ గిద్ద మోడల్ పాఠశాల, నాగర్ కర్నూల్ జిల్లా, పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాల, జగిత్యాల రూరల్ మండలం, లక్ష్మిపూర్ గ్రామం గురుకుల పాఠశాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థినిలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 48 గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనాలు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు.

ప్రతిపక్షాలపై నోరు పారేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోజురోజుకీ దిగజారుతున్న గురుకులాల దీనస్థితి కనిపించడం లేదా?, వరుసగా ఫుడ్ పాయిజన్లు జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే మనస్సు కరగడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్ గురుతులు చెరిపేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గురుకులాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుండటం చారిత్రక నేరమన్నారు. సంకుచిత మనస్తత్వంతో దళిత, గిరిజన, బడుగు, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకునే గురుకులాల ఖ్యాతికి గ్రహణం పట్టిస్తుండటం దుర్మార్గమని హరీశ్ రావు విమర్శించారు. స్వయంగా తానే మానిటరింగ్ చేస్తానని బీరాలు పలికిన రేవంత్ రెడ్డి, మీ మానిటరింగ్ ఏమైంది?, విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండి మీరు చేస్తున్నదేమిటి? అడిగారు.

ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప, రాష్ట్రంలో పరిపాలనను చక్కదిద్దడం చేతగాదా?, 20 నెలల కాంగ్రెస్ పాలనలో పాము కాట్లు, ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్ లతో 100కు పైగా గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురుకులాల ఖ్యాతిని ఎవరెస్ట్‌ శిఖరం ఎత్తున నిలబెడితే.. రేవంత్‌ రెడ్డి అధఃపాతాళానికి దిగజార్చాడని వ్యాఖ్యానించారు. ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోతే మీ రాతి గుండె కరుగుతుంది? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు.