21-11-2025 01:11:42 AM
8 వారాల పైలెట్ ప్రోగ్రాం అమలుకు నిర్ణయం
సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ ఏఐ సీఈవో కిప్మన్ భేటీ
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): హైదరాబాద్ను దేశంలోనే అత్యంత నివాస యోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం అనలాగ్ ఏఐ సీఈఓ అలెక్స్ కిప్మన్ సీఎంను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను చర్చించారు. ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, సరస్సుల రక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించే మార్గాలను చర్చించారు.
‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ ఆధారంగా రియల్ టైమ్ సెన్సార్ నెట్వర్క్, స్మార్ట్ సిటీ నిర్వహణ పద్ధతులను అమలు చేసే వీలుందని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా హైద రాబాద్ సిటీలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. ఎనిమిది వారాల పాటు ఈ ప్రోగ్రాం అమలవుతుంది.
కాగా భారత్ ఫ్యూచర్ సిటీ ని పరిశోధన, సుస్థిర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను వివరించారు. ఆర్థిక వృద్ధికి సైతం ఫిజికల్ ఇంటెలిజెన్స్ అత్యుత్తమ పరిష్కారాలను అందిస్తుందని కిప్మన్ తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. డిసెంబర్ 8 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని సీఎం ఆయనను ఆహ్వానించారు.