ఎల్ అండ్ టీ మెట్రోకు గోల్డెన్ పీకాక్ అవార్డు
హైదరాబాద్ : అత్యుత్తమ భద్రత ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను ఎల్అండ్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్)కు ‘గోల్డెన్ పీకాక్’ అనే అవార్డు పొందుకుంది. జూన్ 17వ తేదీన ప్రతిష్ఠాత్మక ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సర్టిఫికెట్ లభించగా గోల్డెన్ పీకాక్ అనే అవార్డును పొందినట్లు మెట్రో అధికారులు సోమవారం తెలిపారు. అత్యున్నత భద్రత ప్రమాణాలు, పని ప్రదేశంలో ఆరోగ్యకరమైన పరిస్థితులను పాటించడానికి ప్రాధాన్యతనివ్వడంపై ఎల్ అండ్ టీ బృందం చేస్నున్న నిరంతర కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ కార్యకలాపాల నిర్వహణలో తోడ్పాటునందిస్తున్న ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
బెంగుళూరులో ఇటీవల నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ’ఎస్) 25వ ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అండ్ క్లుమైట్ చేంజ్‘ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఉదయ్ యూ లలిత్, కర్ణాటక హైకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి ఈ అవార్డులను ప్రదానం చేశారని చెప్పారు. గోల్డెన్ పీకాక్ అవార్డు కోసం మొత్తం 778 దరఖాస్తులు రాగా తీవ్రమైన పోటీలో తమ సంస్థ విజేతగా నిలిచిందన్నారు. ఎల్అండ్టీ మెట్రో హైదరాబాద్ లిమిటెడ్లో ప్రత్యక్షంగా 126 మంది ఉద్యోగులు, 2,600 మంది కి పైగా సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. భద్రతా ప్రమాణాలను కొనసాగించడానికి తాము నిరంతరం కృషి చేస్తామన్నారు.






