28-06-2025 11:56:41 PM
మంత్రి జూపల్లి రెండు రోజుల పర్యటనలో జిల్లా ఒరిగిందేమి లేదు
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్,(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల అవినీతి... ఈ కారు రేసులో అవినీతి... ఫోన్ ట్యాపింగ్ కేసు లు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే అవినీతిని నిరూపించి తమ నేతలను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ శ్రేణులతో కలిసి జోగు రామన్న మీడియాతో మాట్లాడుతూ... జిల్లాలో రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో నూతనంగా అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ లో ఉన్న పనుల గురించి ప్రస్తావన లేకుండా ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చారని అన్నారు. వైఎస్ఆర్, కేసీఆర్ మంత్రి వర్గంలో పని చేసిన సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ 8 లక్షల కోట్ల అప్పు చేసిందని అబద్దాలు మాట్లాడడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయంలో జిల్లాలో అయిదు వేల కోట్లతో అభివృద్ధి జరిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.