14-06-2025 05:51:53 PM
న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి..
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్(Lok Adalat) కార్యక్రమాన్ని శనివారం ఇల్లందు మండల న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం కక్షిదారులు క్షణికావేశంలో పెట్టుకున్న పోలీస్ కేసులు రాజిపడదగిన, మనోవర్తి, గృహింస, చెక్ బౌన్స్, ప్రామిసరీ నోటు కేసులు ఇట్టి కేసులలో ఇరువర్గాలు కోర్టుకు వచ్చి రాజి కుదుర్చుకున్నట్లైతే ఇరువర్గాలు గెలిచినట్లే అవుతుందన్నారు.
తద్వారా ఎంతో విలువైన కాలాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చునని, అంతేకాకుండా ఒకసారి లోక్ అదాలత్ లో రాజీ పడినట్లయితే పైకోర్టుకు వెళ్లి అప్పిల్ అవకాశం ఉండదని, కక్షిదారులు గ్రామస్థాయిలో పెద్దమనుషుల సమక్షంలో రాజి చేసుకున్న కేసులలో వారు చేసే అగ్రిమెంట్లకు చట్టబద్ధత ఉండదని, కోర్టుకు వచ్చి లోక్ అదాలత్ ద్వారా రాజీ పడినట్లయితే చట్టబద్ధత ఉంటుందని, కక్షిదారులు పంతాలకు పోకుండ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. అనంతరం ఇల్లందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తి చేతుల మీదుగా కక్షిదారులకు మొక్కలు పంపిణీ చేసి విధిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తితో పాటు ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తిక్, సీనియర్ న్యాయవాదులు పెద్దూరి వెంకట నరసయ్య, పప్పుల గోపీనాథ్, దంతాల ఆనంద్, ఎస్, వెంకటేశ్వర్లు, జూనియర్ న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.