ప్రభుత్వ బడిలో చేర్పిస్తే ‘ఇంటి పన్ను’ నేనే కడతా
రుద్రారం సర్పంచ్ రవీందర్ వినూత్న ప్రకటన
నవాబ్పేట జూన్ 24 : మండల పరిధిలోని రుద్రారం గ్రామ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు సర్పంచ్ కే. రవీందర్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల లో చేర్పించే తల్లిదండ్రుల సొంత ఇంటి పన్నును తానే స్వయంగా చెల్లిస్తానని ఆయన ప్రకటించారు.ఈ రోజు పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దల ఉమ్మడి సమావేశంలో సర్పంచ్ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ వినూత్న పిలుపునకు గ్రామస్తుల నుంచి తక్షణ స్పందన లభించింది. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న 14 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వ బడిలో చేర్పించారు.
సర్పంచ్ ఉదారత్వాన్ని మండల విద్యాధికారి నాగ్యా నాయక్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. ఇదే పట్టుదలతో బడిలో పిల్లల సంఖ్యను ఇంకా పెంచితే, పాఠశాలకు అదనంగా మరో ఇద్దరు ఉపాధ్యాయులను మరియు మరిన్ని మౌలిక వసతులను కేటాయిస్తామని ఎంఈవో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ సంద శేఖర్, పీఏసీఎస్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, వార్డు మెంబర్ మాల యాదయ్య, మార్కెట్ డైరెక్టర్ వెంకటేష్, స్థానిక నాయకులు బాలయ్య, నరసింహులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.






