02-10-2025 12:25:42 AM
గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగం పొందిన లావణ్య ను సన్మానించిన కామారెడ్డి ఎస్పి
కామారెడ్డి, అక్టోబర్ 1 (విజయక్రాంతి): పట్టుదలతో కష్టపడితే ఫలితం తప్పక వస్తుందని అందుకు ఉదాహరణ రామారెడ్డి ఎస్ఐ లావణ్య అని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర తెలిపారు. రామారెడ్డి ఎస్ఐ ఆర్. లావణ్య విజయప్రస్థానం కృషి, పట్టుదలతో యువతకు ఆదర్శము అన్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి గ్రూప్-1 లో జిల్లా అధికారి వరకు ఆర్. లావణ్య ప్రయాణం పట్టుదల కృషికి నిదర్శనం అన్నారు.
కష్టపడితే ఫలితం వస్తుందనడానికి ఇది నిదర్శనం రామారెడ్డి లావణ్యని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సన్మానించారు. రామారెడ్డి లావణ్య మొదటగా 2018లో ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. 2020లో సివిల్ ఎస్త్స్రగా, 2025లో గ్రూప్1లో జిల్లా బిసి వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టును సాధించడం ద్వారా అసాధారణ ప్రతిభను చాటుకున్నారు. ఎస్హెచ్వో గా విధులు నిర్వహిస్తూ, తన కృషి, పట్టుదలతో యువతకు ఆదర్శంగా నిలిచారు.
జిల్లా పరిషత్ చేబర్తి సిద్ధిపేట్ జిల్లా లో ప్రాథమిక విద్యను పూర్తిచేసి, తరువాత త్రిపుల్ ఐటీ బాసరలో సీటు సాధించి మంచి ఆసక్తితో విద్యను అభ్యసించారు. పోలీస్ ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు, ఆటుపోట్లు, సమయ పరిమితులను అధిగమిస్తూ, లభించిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని గ్రూప్1 ఉద్యోగాన్ని సాధించడం గొప్ప విషయం అని జిల్లా ఎస్పీ అభినందించారు.
జిల్లాలో ప్రొబేషనరీ పూర్తి చేసిన అనంతరం, లావణ్య నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్, రామారెడ్డి పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ గా విధులు నిర్వహించారు. పోలీసు విధులలో ఎలాంటి రిమార్కులు లేకుండా అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా తన ప్రతిభతో మంచి పేరు సంపాదించి, ప్రజలకు సేవ చేస్తూ, తనదైన ముద్రను వేసుకోవాలని ఆకాంక్షించారు. ఆర్. లావణ్య కృషి, పట్టుదల, తపన యువతకు, ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.