23-10-2025 02:36:47 PM
దళారుల జేబుల్లో నిరుపేదల ఆకలి.
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో(Maripeda Mandal) పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వ సన్నబియ్యం పక్కదారి పడుతున్నట్టు సమాచారం అందుతోంది. నిత్యం నిరుపేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని దళారులు వెంకటియ తండా , గిరిపురం ,చిల్లంచర్ల, గ్రామాల నుంచి అత్యధికంగా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తున్నా, సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అన్నపూర్ణగా విరాజిల్లుతున్నా, ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఈ బియ్యం కొందరి కక్కుర్తి కారణంగా లాభార్జనకు సాధనంగా మారుతోంది. మరిపెడ మండలం నుండి సూర్యాపేట జిల్లా వంటి సరిహద్దు ప్రాంతాలకు ఈ బియ్యాన్ని రహస్యంగా తరలిస్తున్నట్లు సమాచారం.
నల్లబజారులో సాగుతున్న ఈ వ్యాపారంలో, మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.90 వరకు పలుకుతున్న సన్నబియ్యాన్ని దళారులు రేషన్ కార్డు లబ్ధిదారుల నుండి కేవలం రూ.10 నుండి రూ.15 ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. పేదల ఆకలిని పెట్టుబడిగా మార్చుకొని ఈ దందా గిరిపురం,అనేపురం, చిల్లంచర్ల కేంద్రంగా సాగుతోంది. సేకరించిన ఈ బియ్యాన్ని కాకరావయి ప్రాంతానికి భారీఎత్తున చేరవేసి, అధిక ధరలకు అమ్ముకుంటూ లాభాలను ఆర్జిస్తున్నారు. దళారుల ముఠా చాకచక్యంగా ఈ అక్రమ రవాణాను నడుపుతున్నా, అధికారులు కేవలం నామమాత్రపు చర్యలు తీసుకుని, చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ, పేదల సరుకును దోచుకుంటున్న ఈ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే మేల్కొని ఈ సన్నబియ్యం దారి మళ్లింపును పూర్తిస్థాయిలో అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.