01-11-2025 08:21:14 PM
* మణికొండలో కబ్జాపై ఉక్కుపాదం
* రూ. 20 కోట్ల పార్కు స్థలానికి విముక్తి
* జేసీబీలతో అక్రమ కట్టడాలు ధ్వంసం
మణికొండ,(విజయక్రాంతి): విలువైన ప్రభుత్వ భూములే లక్ష్యంగా దందా సాగిస్తున్న కబ్జాదారులపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన అధికారులు, సుమారు రూ. 20 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడారు. అక్రమార్కుల చెరలో ఉన్న స్థలాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... గండిపేట మండలం, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో సర్వే నెం. 322-2655 లో 1600 గజాల పార్కు స్థలం ఉంది.
కొంతకాలంగా ఈ విలువైన స్థలంపై కన్నేసిన కొందరు అక్రమార్కులు, దానిని చెరపట్టి నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించారు. దీనిపై స్థానికులు పలుమార్లు వివిధ శాఖల అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. దీంతో విసిగిపోయిన స్థానికులు, చివరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాలతో శనివారం రంగంలోకి దిగిన అధికారులు భారీ బందోబస్తు నడుమ జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. అనంతరం స్థలాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని, ఇది ప్రభుత్వానికి చెందిన పార్కు స్థలం అని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.
మరిన్ని స్థలాలు కూడా..
ఈ ఆపరేషన్తో పాటే, మణికొండ పరిధిలో మరికొన్ని విలువైన ప్రభుత్వ స్థలాలను కూడా అధికారులు రక్షించారు. తిరుమల హిల్స్లో 6050 గజాల పార్కు స్థలం, వెస్ట్రన్ ప్లాజాలో ఒకటిన్నర ఎకరం ప్రభుత్వ స్థలాలను సైతం స్వాధీనం చేసుకుని, హైడ్రా బోర్డులను పాతారు. ఎట్టకేలకు విలువైన ప్రభుత్వ, పార్కు స్థలాలు కబ్జా చెర నుంచి విడిపించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.