21-06-2025 12:43:13 AM
చోద్యం చూస్తున్న అధికారులు
చేగుంట, జూన్ 20 : కలప వ్యాపారుల స్వార్థానికి పచ్చని చెట్లు బలవుతున్నాయి. చేగుంట మండల కేంద్రంలో కలప స్మగ్లర్లు గ్రామాలలో చెట్లను యథేచ్ఛగా నరికి వేయడంతో రోజురోజుకు అటవి సంపద అంతరించిపోతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
మండల కేంద్రంలో ఉన్న కొందరు కలప స్మగ్లర్లు వేప, తుమ్మ, చింత చెట్లను విచ్చలవిడిగా నరికి ప్రతినిత్యం గ్రామాల నుండి పట్టణ కేంద్రంలో ఉన్న పలు కలప కంపెనీలకు చేరవేసి లక్షల్లో సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళ వ్యవహారం దొరికితే దొంగలు, లేకపోతే దొరలు అన్నట్టుగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు , స్మగ్లర్ల పైన గట్టి నిఘా పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని వృక్ష ప్రేమికులు కోరుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘనలు...
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతు పొలాల్లో, రహదారులు, కొండల్లో ఉన్న చెట్లను నరికి వేయాలంటే వాల్టా చట్టం ప్రకారం ముందుగా తమ పొలంలో ఉన్న చెట్లను, సర్వేనెంబర్ తో సహా తహసిల్దార్ కు దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాలి.
అనంతరం రెవెన్యూ అధికారులు ఆ చెట్లను పరిశీలించి, సంబంధిత అటవీ అధికారులకు నివేదిక సమర్పిస్తారు, అనుమతి కోసం అటవీ అధికారులకు చాలానా చెల్లించి, ఆమోదం లభించాకే చెట్టు నరికి, తరలించాలి. కానీ స్మగ్లర్లు క్షేత్రస్థాయిలో అధికారులకు దరఖాస్తు చేసుకున్న దాఖలాలు లేవు. స్మగ్లర్లు అడ్డగోలుగా చెట్లు నరికి లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు.