calender_icon.png 7 June, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకునేలా ‘అమృత్’స్టేషన్లు

20-05-2025 01:15:23 AM

  1. 22న వరంగల్, బేగంపేట, కరీంనగర్ స్టేషన్ల ప్రారంభం 
  2. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఈ నెల 22న దేశవ్యాప్తంగా పునర్నిర్మించిన 103రైల్వేస్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం (ఏబీఎస్‌ఎస్) పథకం ద్వారా ఈ రైల్వే స్టేషన్లను రైల్వేశాఖ అధునాతనంగా తీర్చిదిద్దింది. రాష్ర్టంలో ఏబీఎస్‌ఎస్ లో భాగంగా దాదాపు రూ.2,750కోట్లతో 40 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో రాష్ట్రంలోని వరంగల్, బేగంపేట, కరీంనగర్ రైల్వేస్టేషన్లున్నాయి.

బేగంపేట రూ.26.55 కోట్లు, కరీంనగర్ రూ.25.85 కోట్లు, వరంగల్ రూ.25.41కోట్లతో పునర్నిర్మించారు. అమృత్ స్టేషన్లలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలు, వసతులను వివరించేందుకు సోమవారం రైల్వేశాఖ మీడియా టూర్ ఏర్పాటుచేసింది. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ శ్రీధర్, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ విశాల్, ఇతర సిబ్బంది కొత్త రైల్వేస్టేషన్లలో అందుతున్న సేవలను మీడియాకు వివరించారు. 

నగరంలో మరో అత్యాధునిక స్టేషన్‌గా బేగంపేట

బేగంపేట రైల్వేస్టేషన్ ద్వారా నిత్యం 100కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. చూసేందుకు స్థానిక స్టేషన్‌లా కనిపించినా ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ఆపుతారు. ఫలితంగా నగరంలోని చాలామంది ఈ స్టేషన్ నుంచి సేవలు పొందుతున్నారు. ఏబీఎస్‌ఎస్ భాగంగా బేగంపేట స్టేషన్‌లో అధునాతన రైల్వేస్టేషన్ భవనం, సర్క్యులేటింగ్ ఏరియా, ఆకట్టుకునేలా ప్రవేశ ద్వారం, 12మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టులు, ఎస్కలేటర్లు, రాక్‌గార్డెన్, విశాలమైన వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు.

అలాగే ఇక్కడ రూ.12కోట్ల వ్యయంతో రెండో ప్రవేశ ద్వారం అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. జంట నగరాల్లో ముఖ్యమైన స్టేషన్లలో ఒకటైన బేగంపేట స్టేషన్ సబర్బన్, నాన్ -సబర్బన్ ప్రయాణికుల అవసరాలను తీరుస్తోంది. ఈ స్టేషన్ ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏబీఎస్‌ఎస్ కింద రూ.26.55కోట్లతో పునరాభివృద్ధి చేశారు. ఫిబ్రవరి, 2024లో పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయగా తిరిగి ఆయనే ఈ నెల 22న ప్రారంభోత్సవం చేయనున్నారు. 

రైల్వే మౌలిక వసతుల కల్పనే ధ్యేయం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని వరంగల్ రైల్వేస్టేషన్‌లో రూ.25.41 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టాం. అత్యాధునిక సౌకర్యాలతో తలపెట్టిన ఈ పునరుద్ధరణ ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందబోతున్నాయి. రాష్ట్రంలో రైల్వే మౌలి క వసతుల కల్పన, సౌకర్యాలను మెరుగుపరచడంలో ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

కరీంనగర్ అమృత్‌స్టేషన్..

కరీంనగర్ రైల్వేస్టేషన్‌ను రూ.25.85కోట్లతో పునరాభివృద్ధి చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ కేవలం 10 రైళ్లను మాత్రమే నడిపిస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఈ స్టేషన్‌నుంచి మరిన్ని రైళ్లను ప్రారంభించే ఉద్దేశంతోనే రైల్వేశాఖ ఏబీఎస్‌ఎస్‌లో చేర్చి అభివృద్ధి చేసింది. దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ రూపొందించారు. వెయిటింగ్ హాల్, బుకింగ్ కార్యాలయంతో పాటు కొత్త స్టేషన్ భవనం, దివ్యాంగజన సౌకర్యాలు, ల్యాండ్‌స్కేపింగ్, మూడు ప్లాట్‌ఫామ్‌లపై నూతనంగా షెల్టర్, సౌర విద్యుత్ ప్లాంట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 2 లిఫ్ట్‌లు, 2 ఎస్కలేటర్లు, కొత్త సిగ్నలింగ్ వ్యవస్థ రూపొందించారు. 

వరంగల్‌లో మరో అధునాతన స్టేషన్..

రాష్ర్టంలోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ఒకటైన వరంగల్ రైల్వేస్టేషన్‌ను రూ.25.41కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేపట్టారు. ప్రస్తుతం నిత్యం దాదాపు 22వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దాదాపు 150 రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఆకట్టుకునేలా ప్రవేశ ద్వారం, అత్యాధునిక వెయిటింగ్ హాల్స్, ల్యాండ్‌స్కేపింగ్, ప్లాట్‌ఫామ్ షెల్టర్, ప్లాట్‌ఫామ్ 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 3 లిఫ్ట్‌లు, 4 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు.