24-04-2025 01:26:52 AM
సృజనాత్మక ప్రాజెక్టులతో పోటీపడ్డ విద్యార్థులు
హైదారబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం అబ్దుల్ కలామ్ ఆడిటోరియంలో ఓపెన్ హౌస్ డేను నిర్వహించారు. యూనివర్సిటీకి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, ఫ్యాకల్టీలు తమ ప్రాజెక్టులతో హౌస్లో పాల్గొన్నారు. విద్యార్థుల నుంచి 150 పైగా పరిశోధక ప్రాజెక్టులు, ఫ్యాకల్టీల నుంచి మూడు నూతన అంకుర ప్రాజెక్టులు పోటీ పడ్డాయి.
యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీహెచ్ సతీశ్కుమార్ ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థుల్లో నూతన సృజనలకు ప్రాణం పోయడమే కాకుండా కొత్త ఆవిష్కరణలకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రొఫెసర్లు ఏర్పాటు చేసిన టెక్నాలజీ ప్రాజెక్టుల దగ్గరకి వెళ్లి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వీఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, బయో మెడికల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెక్టార్ల నుంచి విద్యార్థులు నూతన ప్రాజెక్టులు తయారు చేసి వాటి వివరాలను వెల్లడించారు. ప్రధానంగా డ్రోన్, సెన్సార్, సోలార్ పవర్ టెక్నాలజీలతో రూపొందించిన పలు ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి.
నూతన ప్రాజెక్టులతో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిన విద్యార్థులు పూజారి శ్రీసాయి మణికంఠ, అజిత్ కుమార్ (అటానమస్ బ్రోన్ డెలివరీ సిస్టమ్), సేడ్ జాబ్ గెలేజా (రోబోటిక్స్ అండ్ బయోనిక్స్), జల్లేపల్లి భనేశ్కుమార్, షేక్ సాయితే జమీన్, పొండల వెంకట రమణమూర్తిలతో పాటు పలువురు ఎంటెక్ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో పరువురు పారిశ్రామిక రంగ నిపుణులతో పాటు రిజిస్ట్రార్ డాక్టర్ ప్రేమ్ కుమార్, డీన్ సీవీ టామి, ఈసీఈ హెడ్ డాక్టర్ కేఏ సునీత, డైరెక్టర్ అనూప్ సూర్యవంశీ, ప్రొఫెసర్లు వడ్డి రమేశ్, సుజిత్ కల్లూరి, డాక్టర్ ప్రద్యుత్, డాక్టర్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.