ఎంపీడీవో కార్యాలయ భవనం ప్రారంభం
పటాన్చెరు, జూన్ 20: కొత్తగా ఏర్పడిన గుమ్మడిదల మండలంలో నూతన నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని సంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి గురువారం ప్రారంభించారు. భవనాన్ని బొంతపల్లి పారిశ్రామికవాడలోని శ్యామ్ పిస్టన్ అండ్ రింగ్స్ లిమిటెడ్ పరిశ్రమ సీఎండీ సారెపల్లి మృత్యుంజయరావు జ్ఞాపకార్థం రూ.60 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించారు. కొత్త భవనంలో ఎంపీడీవోగా ఉమాదేవి బాధ్యతలు తీసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎంపీపీ సద్ది ప్రవీణవిజయభాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ కుమార్గౌడ్, వైస్ ఎంపీపీ మంజులవెంకటేశ్ గౌడ్, తహసీల్దార్ గంగాభవాని, మండల ప్రత్యేకాధికారి అఖిలేశ్ రెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ప్రొటోకాల్పై వాగ్వాదం..
భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొటోకాల్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీటీసీలు ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకంపై పేర్లు లేవని అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎంపీడీవో స్పందించి గొడవ సద్దుమణిగేలా చేశారు.






