కఠోర శ్రమతో ముందుకు సాగండి
యువ క్రీడాకారులకు పీటీ ఉష పిలుపు
తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభం
హైదరాబాద్, జూలై 9: ప్రతీ చాంపియన్ ప్రయాణం కలతోనే ప్రారంభవుతుందని, అది సాకారమయ్యేవరకూ ప్రయాణం ఆపొద్దని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష వ్యాఖ్యానించారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి, అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభోత్సవం భారత క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంనీ, ఈ భవనం కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు, భావితర క్రీడాకారుల కలలను సాకారం చేసే కేంద్రంగా, ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలవనుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయమన్న పీటీ ఉష రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యను ప్రశంసించారు. యువ క్రీడాకారులు క్రమశిక్షణ, అంకితభావం, కఠోర శ్రమతో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.






