01-06-2025 12:26:43 AM
- ఇదే నా విధానం.. తెలంగాణ అభివృద్ధే నా అభిమతం
- అధికారంలో ఉన్నా లేకున్నా పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తా..
- తెలంగాణ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలి
- ఇంగ్లాండ్లో పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): దిగ్గజ కార్పోరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలు అందించడం మనందరికీ గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. అధికారంలో ఉన్నా, లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతం అన్నారు. ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అన్నదే తన విధానం అన్నారు.
పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలన్నారు. అందుకోసం తమ సర్వశక్తులు ఉపయోగిస్తామన్నారు. ఇంగ్లాండ్ వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన ‘ప్రాగ్మాటిక్ డిజైన్ సోల్యూషన్ లిమిటెడ్ నాలెడ్జ్ సెంటర్’(పీడీఎస్ఎల్)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ విజయాలపై మాట్లాడాలంటే ఎల్లప్పుడూ తనకు గర్వంగా ఉం టుందన్నారు. ఆటోమోబైల్ రంగంలో పీడీఎస్ఎల్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. పీడీఎస్ఎల్ తన కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించాలని కోరారు.
ఇంగ్లాండ్లో యూనివర్సిటీ, ఇండస్ట్రీ మధ్య ఉన్న పరస్పర సహకారం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలను అందించే పీడీఎస్ఎల్ సంస్థ, వార్విక్ యూనివర్సిటీలో తన నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించుకోవడం తెలంగాణ టాలెంట్కు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వినూత్న విధా నాలతోనే ఆటోమోటివ్ హబ్గా పుణె, చెన్ను సరసన హైదరాబాద్ నిలిచిందన్నారు.
తమ ప్రభుత్వ కాలంలోనే ఐటీ, లైఫ్ సెన్సైస్తో పాటు ఆటోమోటివ్ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటిందన్నారు. భారతదేశంలో ఫార్ములా ఈ రేసింగ్ చాంపియన్షిప్ను నిర్వహించిన మొదటి రాష్ర్టం తెలంగాణ అని కేటీఆర్ అన్నారు. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి కార్పోరేట్ దిగ్గజాలు తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్లో ప్రారంభించాయని చెప్పారు.
తమ తొమ్మిదేండ్ల కాలంలో ఐటీ ఉద్యోగాలు, ఎగుమతులతో పాటు ఇతర రంగాల్లో నూ తెలంగాణ అద్భుతంగా పురోగతి సాధించిందన్నారు. నాలెడ్జ్ సెంటర్ను ప్రారంభించిన ఆనంత రం అక్కడ జరిగే కార్యకలాపాలను కేటీఆర్ పరిశీలించారు. తమ సంస్థ గురించి పీడీఎస్ఎల్ ప్రతిని ధులు ఆయనకు వివరించారు. కంపెనీ సిబ్బంది, ఉద్యోగులతో కేటీఆర్ ఇంటరాక్ట్ అయ్యారు.