19-06-2025 12:00:00 AM
బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి
జగిత్యాల అర్బన్, జూన్ 18 (విజయక్రాంతి): మోడీ నాయకత్వంలో భారత దేశం ప్రపంచంలోనే అగ్ర దేశంగా అభివృద్ధి చెందుతున్నదని బిజెపి శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలైన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో భారత్ త్వరలోనే ప్రపంచంలో నాల్గవ ఆర్థిక శక్తిగా మారనుందన్నారు. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే దేశ భద్రతలో రాజీ లేకుండా రక్షణ వ్యవస్థను పటిష్టం చేశారన్నారు. భారత్ వైపు ఏ శత్రు దేశం కూడా కన్నెత్తి చూసే సాహసం చేసే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు.
దొంగ చాటుగా వచ్చి హిందువులను ఊచకోత కోసిన పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పేర తగిన బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ పై కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడడాన్నీ తప్పు పట్టారు.
కాంగ్రెస్ పాలనలో రోజుకో చోట బాంబు దాడులు, హింసా కాండ చెలరేగేవని, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు దేశంలో పెట్రేగిపోయినా నిమ్మకు నీరెత్తినట్లున్న కాంగ్రెస్ పార్టీ నేడు విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు యాదగిరి బాబు, పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.