19-06-2025 05:03:34 PM
వామపక్ష పార్టీల డిమాండ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): పాలస్తీనా ప్రజలపై గత 20 నెలలుగా గాజాపై ఇజ్రాయిల్ నిరంతరం వైమానిక దాడులకు పాల్పడుతూ మారణహోమాన్ని సృష్టిస్తుందని, తాజాగా ఇరాన్ పై యుద్ధం ప్రకటించి జనావాసాలపై రాకెట్ దాడులతో విధ్వంసం సృష్టిస్తుందని, తక్షణం యుద్ధాన్ని ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు గౌని ఐలయ్య, విజయ సారధి, సాదుల శ్రీనివాస్, పాయం చంద్రన్న అన్నారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ఇజ్రాయిల్ యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సందర్భంగా వాము పక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ... ఇప్పటికే 50 వేల మంది మరణించారని, ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థుల ఆశయాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ దాడులకు దిగుతుందని, పాలస్తీనాలో పుట్టిన ప్రతి బిడ్డను చంపుతామని ఇజ్రాయిల్ మంత్రి ప్రకటించడం అమానవీయ యుద్ధ పిపాసతకు నిదర్శనమని విమర్శించారు.
ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ అమెరికా, కొన్ని మిత్ర దేశాలు మద్దతుతో ఇజ్రాయిల్ దాడులను కొనసాగిస్తుందని విమర్శించారు. మానవ హక్కులను కాలరాస్తున్న దురహంకార మారణ హోమ యుద్ధాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర బిజెపి సర్కార్ ఇజ్రాయిల్ అనుకూల విధానాలను విడనాడాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్ తో ఉన్న అన్ని రకాల సైనిక, భద్రత సహకారాలను వెంటనే విరమించాలని డిమాండ్ చేశారు. పాలస్తీనాకు సంఘీభావంగా నిలబడాలని కోరారు.